బయో సెక్యూర్ వాతావరణంలో టెస్టు:
ఈ రోజు మొదలవనున్న తొలి టెస్టుకు సౌతాంప్టన్లోని రోజ్ బౌల్ స్టేడియం వేదిక కానుంది. ఈ సిరీస్ కోసం కరీబియన్ దీవుల నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన వెస్టిండీస్ జట్టు 14 రోజుల క్వారంటైన్ను ముగించుకొని మ్యాచ్కు రెడీ అయింది. ఇక మైదానంలో అభిమానులు లేకున్నా ఆటగాళ్లకు ఆ లోటు కనిపించకూడదని.. కేరింతలతో కూడిన శబ్దాలు, మ్యూజిక్ను ఏర్పాటు చేసిన ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఈ సిరీస్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బయో సెక్యూర్ వాతావరణంలో జరిగే ఈ సిరీస్ సఫలీకృతమైతే.. సిరీస్లు నిర్వహించాలని మిగిలిన దేశాల బోర్డులు కూడా చూస్తున్నాయి.
స్టోక్స్ తొలిసారి:
ఇంగ్లండ్ టెస్టు రెగ్యులర్ కెప్టెన్ జో రూట్ వ్యక్తిగత కారణాల వల్ల ఈ మ్యాచ్కు దూరం కావడంతో అతడి స్థానంలో వైస్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలిసారి నాయకత్వం వహిస్తున్నాడు. దీంతో స్టోక్స్.. ఇంగ్లిష్ జట్టుకు 81వ సారథి కానున్నాడు. రూట్ అందుబాటులో లేకున్నా.. స్టోక్స్, బట్లర్, బర్న్స్, సిబ్లే, డెన్లీ, క్రాలీ, వోక్స్తో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. అండర్సన్, బ్రాడ్, వోక్స్, స్టోక్స్తో పాటు ఆర్చర్ బౌలింగ్ భారాన్ని మోయనున్నారు.
హోల్డర్పైనే భారం:
మూడు దశాబ్దాలుగా కరీబియన్ జట్టు ఇంగ్లండ్లో టెస్టు సిరీస్ నెగ్గలేదు. జాసన్ హోల్డర్ సమర్థవంతమైన నాయకుడే అయినా.. సరిపడా వనరులు లేక ఆ జట్టు వెనుకబడిపోతున్నది. ఇక ఈ సిరీస్కు ముందే ఇంగ్లండ్ వెళ్లేందుకు కీలక ఆటగాళ్లు నిరాకరించడం కూడా కాస్త దెబ్బతీసింది. బ్యాటింగ్లో హోప్, బ్రాత్వైట్, బ్రూక్స్, క్యాంప్బెల్, హోల్డర్పైనే భారం ఉండనుంది. బౌలింగ్ విషయంలో విండీస్ కాస్త మెరుగ్గానే ఉంది. రోచ్, హోల్డర్, జోసెఫ్, గాబ్రియల్తో ఇంగ్లిష్ ప్లేయర్లకు కష్టాలు తప్పకపోవచ్చు. ఇరు జట్ల మధ్య జరిగిన చివరి టెస్టు సిరీస్లో విండీస్ 2-1తో నెగ్గింది.
ఎదురుచూస్తున్న అభిమానులు:
కరోనా వైరస్ బ్రేక్ తర్వాత తిరిగి జరుగబోతున్న తొలి సిరీస్ ఇదే కావడంతో.. అందరి దృష్టి దీనిపై కేంద్రీకృతమైంది. నాలుగు నెలలుగా మ్యాచ్ల కోసం ఎదురుచూస్తున్న అభిమానులతో పాటు.. క్రికెట్ బోర్డులు కూడా ఓ కన్నేశాయి. ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న పొట్టి ప్రపంచకప్పై మల్లగుల్లాలు పడుతున్న ఐసీసీ కూడా ఈ సిరీస్పై ప్రత్యేక దృష్టిసారించింది. బయోసెక్యూర్ వాతావరణంలో మ్యాచ్ల నిర్వహణ ఎలా ఉండబోతుందనే అంశంపై కన్నేసింది. మరోవైపు బీసీసీఐ కూడా ఈ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది.
మధ్యాహ్నం 3.30లకు మ్యాచ్:
ఈ మ్యాచ్ వేదికైన రోజ్ బౌల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్ట్ (2011)లో శ్రీలంకతో ఇంగ్లండ్ తలపడింది. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసినా.. బ్యాట్స్మన్, బౌలర్లు సమంగా రాణించారు. 2014, 2018 పర్యటనల్లో భారత్ ఇక్కడ ఆడిన రెండు టెస్టుల్లోనూ ఓడింది. ఓవరాల్గా ఇక్కడ 3 టెస్టులు జరగగా.. రెండుసార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. మ్యాచ్ ఈ రోజు మధ్యాహ్నం 3.30 నుంచి సోనీ సిక్స్లో ప్రసారం కానుంది.
ఖాళీ మైదానాలు.. బోసిపోయిన స్టాండ్స్:
గతంలో లాగా క్రికెట్ ఉండదు ఇప్పుడు. ఖాళీ మైదానాలు.. బోసిపోయిన స్టాండ్స్ కనిపిస్తాయి. వికెట్ పడితే విభిన్నంగా సంబురాలు ఉంటాయి. ఇక క్యాచ్ పడితే అభినందనలు ఉండవు. కరోనా వ్యాప్తి చెందకుండా బంతిపై మెరుపు కోసం వాడే ఉమ్మి (సలైవా) కూడా ఉండదు. వర్ణవివక్షకు వ్యతిరేకంగా ఈ మ్యాచ్లో ఇరు జట్ల ఆటగాళ్లు 'బ్లాక్ లివ్స్ మ్యాటర్' లోగోతో బరిలో దిగనున్నారు. అమెరికా పోలీసు దౌర్జన్యం కారణంగా ప్రాణాలొదిలిన అమెరికన్-ఆఫ్రికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతికి సంతాపంగా ప్లేయర్ల జెర్సీ కాలర్లపై ఈ లోగో కనిపించనుంది.
ధోనీ.. కొంచెం తెలివిగా, ఇంకొంచెం తీయగా మారాలి: సాక్షి వినూత్న శుభాకాంక్షలు