హైదరాబాద్: బంతి స్వింగ్ కాకపోతే ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భారత్ బలంగా పుంజుకునే అవకాశం ఉందని ఇంగ్లాండ్ మాజీ ఆఫ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ అన్నాడు. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య ఆగస్టు 1 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది.
ప్రస్తుతం ఇంగ్లాండ్లో వేడి సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉండడంతో బంతి స్వింగ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో గ్రేమ్ స్వాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ''బంతి కనుక స్వింగ్ కాకపోతే, ఇంగ్లాండ్ రివర్స్ స్వింగ్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. రివర్స్ స్వింగ్ అయ్యే సమయానికి అండర్సన్ కూడా అలసిపోతాడు'' అని చెప్పాడు.
"అంతేకాదు కోహ్లీ 60-70 పరుగులు చేసి క్రీజులో పాతుకుపోతాడు. ఈ రెండు జట్ల మధ్య గతంలో జరిగిన సిరీస్లో బంతి ఆరంభం నుంచే స్వింగ్ కావడంతో అండర్సన్ విజృంభించాడు. బంతి స్వింగ్ అవుతున్నప్పుడు అండర్సన్ను ఎదుర్కోకూడదనే ప్రపంచంలో ప్రతి బ్యాట్స్మెన్ కోరుకుంటాడు" అని స్వాన్ తెలిపాడు.
"అంటే రాబోయే సిరీస్లో బంతి స్వింగ్ అయితే ఇంగ్లాండ్ సులభంగా గెలుస్తుంది. ఒకవేళ స్వింగ్ కాకపోతే ఫలితం వేరేలా ఉండొచ్చు. భారత్ సిరీస్లో పుంజుకునే అవకాశాలున్నాయి'' అని స్వాన్ తెలిపాడు. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మద్య బర్మింగ్ హామ్ వేదికగా ఆగస్టు 1న తొలి టెస్టు జరగనుంది.