హైదరాబాద్: భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ టెస్టుల్లో ఆడితే చూడాలని ఉందని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఫిల్ టఫ్నెల్ తెలిపాడు. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఉన్న భాగంగా ఇప్పటికే మూడు టీ20లు, మూడు వన్డేల సిరిస్ ముగిసింది.
మూడు టీ20ల సిరిస్ను భారత్ కైవసం చేసుకోగా... మూడు వన్డేల సిరిస్ను ఆతిథ్య ఇంగ్లాండ్ సొంతం చేసుకుంది. ఈ పరిమిత ఓవర్ల సిరిస్లో కుల్దీప్ యాదవ్ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఇంగ్లీషు గడ్డపై టీ20ల్లో ఐదు వికెట్లు తీసిన తొలి ఎడమచేతివాటం స్పిన్నర్గా అరుదైన రికార్డు కూడా నెలకొల్పాడు.
ఆతిథ్య ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ను ఎదుర్కొనేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. ఇంగ్లీషు గడ్డపై కుల్దీప్ యాదవ్ ఒకే మ్యాచ్లో ఆరు వికెట్లు తీయడంతో అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. పరమితి ఓవర్ల సిరిస్ ముగియడంతో ఇరు జట్ల మధ్య ఆగస్టు 1 నుంచి ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో టెస్టు సిరిస్లో భాగంగా మొదటి మూడు టెస్టులకు సెలక్టర్లు ప్రకటించిన భారత జట్టులో కుల్దీప్ యాదవ్ కూడా చోటు దక్కించుకున్నాడు. ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్ టెస్టుల్లో ఆడితే చూడాలని ఉందని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఫిల్ టఫ్నెల్ వ్యాఖ్యానించాడు.
"మూడు ఫార్మాట్లలో కొంతమంది లెగ్ స్పిన్నర్లు రాణించిన సందర్భాలు ఉన్నాయి. కుల్పీద్ యాదవ్ అద్భుతమైన బౌలర్. అతడిలో ఓ ప్రత్యేకత ఉంది. అతడి టెస్టుల్లో కూడా తప్పక రాణిస్తాడు. నేనైతే అతడిని తప్పక ఆడిస్తా. ఇక్కడ మంచి విషయం ఏంటంటే కుల్దీప్ యాదవ్ టెస్టు జట్టులో చోటు దక్కించుకోవడం" అని టఫ్నెల్ పేర్కొన్నాడు.
"ఇంగ్లాండ్ పిచ్లపై పలు కాంబినేషన్లలో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. భారత టెస్టు జట్టులో ముగ్గురు వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. అందులో కుల్దీప్ యాదవ్ ఒకడు" అని అన్నాడు. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ కోసం సెలక్టర్లు స్పిన్నర్లను కూడా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ఆగస్టు 1న బర్మింగ్ హామ్ వేదికగా జరగనుంది. గతేడాది ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చిన సమయంలో కుల్దీప్ యాదవ్ టెస్టుల్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. పల్లెకెలె వేదికగా ఆగస్టు, 2017లో లంకతో జరిగిన టెస్టులో కుల్దీప్ చివరిసారిగా టెస్టు ఆడాడు.