England vs India, 2018: 5వ టెస్టులో నమోదైన రికార్డులివే

హైదరాబాద్: ఇంగ్లాండ్ గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్ గెలుపు కలగానే మిగిలిపోయింది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న రీతిలో ఇంగ్లీషు గడ్డపై టెస్టు సిరీస్ను ఆరంభించిన టీమిండియా ఆ తర్వాత ఆ స్థాయి ప్రదర్శన కనబరుచలేకపోయారు. ఫలితంగా సుదీర్ఘ ఇంగ్లాండ్ పర్యటనను టీమిండియా పరాజయంతో ముగించింది.
కేఎల్ రాహుల్ (224 బంతుల్లో 20 ఫోర్లు, 1 సిక్స్ 149), రిషభ్ పంత్ (146 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 114) సెంచరీలతో గెలుపు కోసం చివరి వరకు ప్రయత్నించారు. ఒకానొక దశలో అనూహ్య ఫలితమూ వచ్చేలా కనిపించింది. ఆరో వికెట్కు 204 పరుగుల భారీ భాగస్వామ్యంతో ఈ జోడీ ఆశలు రేకెత్తించింది.
కీలక సమయంలో ఆదిల్ రషీద్ (2/63) చక్కటి బంతితో రాహుల్ను ఔట్ చేసి భారత్ ఆశలకు తెరదించాడు. ఆ వెంటనే పంత్నూ పెవిలియన్ పంపి ఆతిథ్య జట్టుకు విజయాన్ని అందించాడు. 17 పరుగుల తేడాతో చివరి నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ 345 పరుగులకే ఆలౌటైంది.
దీంతో ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో చివరిదైన ఆఖరి టెస్టులో టీమిండియా 118 పరుగులతో ఓడిపోయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ (3/45), శామ్ కర్రన్ (2/23) రాణించారు. ఐదు మ్యాచ్ల సిరీస్లో మూడో టెస్టు మినహా అన్నింటిని గెల్చుకున్న ఇంగ్లండ్ 4-1తో సిరీస్ను సొంతం చేసుకుంది.
కెరీర్ చివరి టెస్టులో సెంచరీ సాధించిన ఆ జట్టు ఓపెనర్ అలిస్టర్ కుక్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కగా.... పరుగుల వరద పారించిన భారత కెప్టెన్ కోహ్లీ, ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన శామ్ కర్రన్లకు సంయుక్తంగా 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డు అందుకున్నారు.
ఐదో టెస్టులో నమోదైన రికార్డులివే:

శామ్ కుర్రన్
* 2 - 21 ఏళ్లు నిండకుండానే ఒక టెస్టు సిరిస్లో 250కిపైగా పరుగులతో పాటు 10 వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా ఇంగ్లాండ్ ప్లేయర్ శామ్ కుర్రన్ అరుదైన ఘనత సాధించాడు. అంతకముందు 1978/79లో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ వెస్టిండిస్తో స్వదేశంలో జరిగిన 6 టెస్టు మ్యాచ్ల సిరిస్లో 329 పరుగులు చేసి, 17 వికెట్లు తీశాడు.

కేఎల్ రాహుల్-అజ్యింకె రహానే
2/3 - 4వ వికెట్కు సెంచరీ భాగస్వామ్యాన్ని ఒక జోడీ నమోదు చేయడం ఇది రెండోసారి. 2/3 స్థానాల్లో బరిలోకి దిగిన రహానేతో కలిసి కేఎల్ రాహుల్ 4వ వికెట్కు గాను 118 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 1983లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా భారత్తో జరిగిన మ్యాచ్లో క్లైవ్ లాయిడ్-లారీ హోమ్స్ జోడీ 237 పరుగులు జోడించారు.

రెండో ఆటగాడిగా రవీంద్ర జడేజా
2 - ఓవల్ టెస్టులో టీమిండియా ఓటమి పాలైనప్పటికీ రవీంద్ర జడేజా రెండు ఇన్నింగ్స్లు కలిపి 99 పరుగులు చేయడంతో పాటు 7 వికెట్లు తీశాడు. అంతకముందు కపిల్ దేవ్ కూడా భారత్ ఓటమిపాలైన టెస్టులో 99 పరుగులతో పాటు 7 వికెట్లు తీశాడు.

మూడో భారత బ్యాట్స్మన్గా విహారి
3 - అరంగేట్రం చేసిన టెస్టు తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ... రెండో ఇన్నింగ్స్లో డకౌట్ అయిన మూడో భారత బ్యాట్స్మన్గా హనుమ విహారి నిలిచాడు. అంతకముందు 1969లో కాన్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో గుండప్ప విశ్వానాథ్, 1999లో మొహాలీ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన టెస్టులో దేవాంగ్ గాంధీ అలానే ఔటయ్యారు.

ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు
6 - భారత జట్టు ఓటమిపాలైన టెస్టులో నాలుగో ఇన్నింగ్స్లో ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు చేయడం ఇది ఆరోసారి.

కేఎల్ రాహుల్ సాధించిన 149 పరుగులు
149 - ఓవల్ టెస్టులో కేఎల్ రాహుల్ సాధించిన 149 పరుగులు... నాలుగో ఇన్నింగ్స్లో ఓ భారత బ్యాట్స్మెన్ సాధించిన రెండో అత్యధిక పరుగులు. 1979లో ఓవల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన టెస్టులో సునీల్ గవాస్కర్ 221 పరుగులు సాధించాడు.

204 పరుగుల భాగస్వామ్యం
204 - ఓవల్ టెస్టులో కేఎల్ రాహుల్-రిషబ్ పంత్ జోడీ నెలకొల్పిన 204 పరుగుల భాగస్వామ్యం భారత తరుపున ఏ వికెట్కైనా రెండో అత్యధిక పరుగుల భాగస్వామ్యం కావడం విశేషం. 1979లో ఇదే వేదికలో సునీల్ గవాస్కర్-చేతన్ చౌహాన్ జోడీ 213 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

జేమ్స్ ఆండర్సన్
564 - టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన పేసర్గా జేమ్స్ అండర్సన్ గుర్తింపు పొందాడు. అంతేకాదు ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం గ్లెన్ మెక్గ్రాత్ (ఆస్ట్రేలియా-563) పేరిట ఉన్న రికార్డును కూడా అతను అధిగమించాడు. ఈ జాబితాలో మురళీధరన్ (శ్రీలంక-800), షేన్ వార్న్(ఆస్ట్రేలియా-708), అనిల్ కుంబ్లే (భారత్-619) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

ఎనిమిదో క్రికెటర్గా కుక్
8 - తన కెరీర్ చివరి టెస్టులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న ఎనిమిదో క్రికెటర్ అలిస్టర్ కుక్ నిలిచాడు. ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో అలెస్టర్ కుక్ హాఫ్ సెంచరీ సాధించగా, రెండో ఇన్నింగ్స్లో సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. కుక్కు టెస్టుల్లో ఇది 33వ సెంచరీ కాడవం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications