
గతంలో విరాట్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన అండర్సన్:
గత పర్యటనలో అండర్సన్ విరాట్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. 2014లో ఇంగ్లాండ్ గడ్డ మీద 10 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి 133 పరుగులు మాత్రమే చేశాడు. కానీ గత నాలుగేళ్లలో కోహ్లి ఎంతో మెరుగయ్యాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల్లో అలవోకగా పరుగులు రాబట్టాడు. దీంతో కోహ్లిని కట్టడి చేయడం కోసం ఇంగ్లాండ్ భారీ ప్రణాళికలతో బరిలో దిగుతోంది.

కోహ్లిని కట్టడి చేస్తే టార్గెట్ తక్కువే:
అండర్సన్ అస్త్రాన్ని మరోసారి ప్రయోగించనున్న ఇంగ్లిష్ జట్టు.. అతడికి తోడుగా బ్రాడ్ కట్టుదిట్టంగా బంతులేయాలని ఆశిస్తోంది. పరుగులు ఇవ్వకుండా కట్టడి చేస్తే కోహ్లిని ఉచ్చులో బిగించవచ్చని ఆశిస్తోంది. మరోవైపు ఇటీవల ముగిసిన పరిమిత ఓవర్ల క్రికెట్లో సత్తా చాటిన అదిల్ రషీద్ను కూడా ఇంగ్లాండ్ టెస్టుల్లోకి ఎంపిక చేసింది. రషీద్కు సొంత గడ్డ మీద ఇదే తొలి టెస్టు కావడం గమనార్హం.

మూడో వన్డేలో రషీద్ అద్భుతమైన డెలివరీ:
ఇప్పటి దాకా పది టెస్టులు ఆడిన ఈ లెగ్ స్పిన్నర్.. ఐదు మ్యాచ్లను భారత గడ్డ మీదే ఆడాడు. మూడో వన్డేలో రషీద్ అద్భుతమైన డెలివరీతో కోహ్లిని బౌల్డ్ చేశాడు. ఇలాంటి మ్యాజిక్ను టెస్టుల్లోనూ రిపీట్ చేయాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ ఆశిస్తోంది. అందుకే రెండేళ్ల తర్వాత అతడికి టెస్టు జట్టులో అవకాశం కల్పించింది.

ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో కోహ్లీ ఒకడు:
‘కోహ్లి బ్యాటింగ్ సామర్థ్యం గురించి మాకు తెలుసు. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో అతడొకడు. గత పర్యటనలో అతడు బాగా ఆడలేదు. కానీ అతడు ఏం చేయగలడో మాకు తెలుసు. అతడి ఆటను చూడటాన్ని ఎంతో మంది ఇంగ్లిష్ ఫ్యాన్స్ ఇష్టపడతారు. తనెంటో కోహ్లి ఇప్పటికే నిరూపించుకున్నాడు. అతణ్ని కట్టడి చేయడం మాకెంతో ముఖ్యం. అతడ కోసం భారీ ప్రణాళికలు రూపొందించాం' అని జోయ్ రూట్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












