హైదరాబాద్: ఇంగ్లాండ్లో భారత బ్యాట్స్మెన్లు పేలవ ప్రదర్శన చేస్తుంటే, అదే పర్యటనలో ఉన్న భారత కోచ్లు ఏం చేస్తున్నారంటూ భారత మాజీ క్రికెటర్ ఫరూక్ ఇంజినీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్తో జరిగిన రెండు టెస్టుల్లో భారత బ్యాట్స్మెన్ పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే.
ఇంగ్లాండ్ బౌలర్ల నుంచి వచ్చే బంతుల్ని సరిగా అంచనా వేయలేక తక్కువ స్కోర్లకే పెవిలియన్కు చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓడిపోగా, లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 159 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవి చూసింది.
ఈ నేపథ్యంలో భారత ఆటతీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా లార్డ్స్ టెస్టులో టీమిండియా కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయిందని అభిమానులు పెద్ద ఎత్తున్న విమర్శలు చేశారు. దీనిపై ఫరూక్ ఇంజినీర్ మాట్లాడుతూ "లార్డ్స్లో భారత్ ఓటమికి చాలా బాధపడ్డాను. ప్రస్తుతం ఇంగ్లాండ్లో భారత ఆటగాళ్లకు అనుకూల పరిస్థితులే ఉన్నాయి" అని అన్నారు.
"అయితే, మరి ఇలాంటి సమయంలో ఎందుకు ఆడలేకపోతున్నారు. స్వింగ్ అయ్యే బంతిని క్రాస్గా ఆడకూడదు. ఇది అందరికీ తెలిసిన విషయం. భారత జట్టుతో పాటు అక్కడే ఉన్న బ్యాటింగ్ కోచ్లు ఏం చేస్తున్నారో, వారికి ఏం చెబుతున్నారో ఏమీ అర్థం కావడం లేదు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"1974లో ఇంగ్లాండ్తో లార్డ్స్ వేదికగా ఆడిన టెస్టులో రెండో ఇన్నింగ్స్లో 42 పరుగులకే ఆలౌటయ్యాం. మొదటి ఇన్నింగ్స్లో 302 పరుగులు చేశాం. ఇప్పటి కోహ్లీ సేన ప్రదర్శన చూస్తే అప్పటి మా ప్రదర్శన కంటే చెత్తగా ఉంది. కనీసం మేము మొదటి ఇన్నింగ్స్లో కాస్త చెప్పుకోదగ్గ స్కోరు చేశాం. వ్యక్తిగతంగా ప్రస్తుత టీమిండియా ఆటగాళ్లంటే నాకు ఇష్టమే. కానీ, వారు ఆడే టెక్నిక్ చూస్తేనే ఆందోళనగా ఉంటుంది" అని అన్నారు.
లార్డ్స్ టెస్టులో ఓటమితో ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో టీమిండియా 0-2తో వెనకబడి ఉంది. ఇరు జట్ల మధ్య నాటింగ్హామ్లోని ట్రెంట్బ్రిడ్జ్లో ఆగస్టు 18నన మూడో టెస్టు ప్రారంభం కానుంది.