క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ:
ఈసీబీ చేసిన ప్రతిపాదన క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఎనిమిది నగరాల మధ్య పోటీ ఏర్పాటు చేసి, 100 బంతులతో కూడిన కొత్త రకం ఫార్మాట్ను తమ దేశీయ క్రికెట్లో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మార్పులు అభిమానులకు ఒకింత ఆశ్చర్యంతో పాటు, గందరగోళానికి గురి చేసింది.
మొత్తం 100 బంతులు ఉండేట్లుగా ప్లాన్:
ఈ ఫార్మాట్లో 6 బంతులతో కూడిన 15 ఓవర్లు.. 10 బంతులతో కూడిన ఓ ఓవర్తో మొత్తం 100 బంతులు ఉండేట్లుగా ప్లాన్ చేస్తున్నామని బోర్డు తెలిపింది. ఈ ప్లాన్ గనుక కార్యరూపం దాల్చితే 2020 ఏడాది నుంచి నూతన ఫార్మాట్ను చూడొచ్చని పేర్కొంది. ఈసీబీ ప్రకటనపై ఇప్పుడు ట్విటర్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దేశంలోని దేశవాళీ క్రికెట్లో ముందుగా ఈ నూతన ఫార్మాట్ను ప్రయోగాత్మకంగా మొదలెట్టాలని భావిస్తున్నారు.
40 బంతులు తక్కువగా :
ఈ కొత్త టోర్నమెంట్లో జరిగే మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం కూడా చేయనున్నారు. ట్వంటీ20 ఫార్మాట్ కన్నా ఇందులో 40 బంతులు తక్కువగా వేస్తారు. దాదాపు రెండున్నర గంటల సమయం తగ్గుతుంది. బంతులు తక్కువగా ఉండటంతో ఆటగాళ్లు వేగంగా ఆడేందుకు ప్రయత్నిస్తారు. మ్యాచ్లు రసవత్తరంగా సాగుతాయి. దీంతో సాయంత్రం సమయాల్లో జరిగే ఈ మ్యాచ్లకు యువతీ యువకులతో పాటు వారి కుటుంబసభ్యులను ఆకర్షించేందుకు వీలవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్:
దీనిపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ స్పందిస్తూ.. ‘క్రికెట్లో ఇప్పుడు 5, 4, 3, 2 రోజుల క్రికెట్, 50, 40, 20, 10 ఓవర్లు, హాంగ్ సిక్సెస్ల అంటూ చాలా ఫార్మాట్లలో క్రికెట్ కొనసాగుతోంది. ఇప్పుడు 100 బంతుల క్రికెట్.. మన గొప్ప ఆటను అర్థం చేసుకునేందుకు గుడ్లక్..' అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. ‘ఈసీబీ కొత్త ఫార్మాట్ ఐపీఎల్ను పాతిపెడుతుంది' అంటూ గార్డియన్ రైటర్ బెర్నే భిన్నంగా స్పందించాడు.