ద్రవిడ్ ఎఫెక్ట్: బీసీసీఐ దారిలో పీసీబీ, జూనియర్లకు కోచ్లుగా మాజీ క్రికెటర్లు

హైదరాబాద్: టీమిండియాకు గత కొంత కాలంగా అద్భుతమైన యువ క్రికెటర్లు అందుబాటులోకి వస్తున్నారు. ఇప్పటికే పలువురు యువ క్రికెటర్లు టీమిండియాలో చోటు దక్కించుకోవడంతో పాటు సీనియర్లను సైతం మరిపిస్తున్నారు. దీనికంతటికీ కారణం మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్. రాహుల్ ద్రవిడ్ స్ఫూర్తితోనే ఇప్పుడు పాకిస్థాన్ కూడా యువ క్రికెటర్లకు శిక్షణ ఇచ్చేందుకు మాజీ క్రికెటర్లను నియమించుకోవాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భావిస్తోంది.

పాక్ తరుపున టెస్టుల్లో పది వేలకు పైగా పరుగులు
ఇందులో భాగంగా యూనిస్ ఖాన్, మహ్మద్ యూసుఫ్లాంటి మాజీ క్రికెటర్లతో ఇప్పటికే చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలో గతేడాది అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన యూనిస్ ఖాన్ను పాకిస్థాన్ అండర్ 19 టీమ్ కోచ్, మేనేజర్గా నియమిస్తారన్న వార్తలు వస్తున్నాయి. పాక్ తరుపున టెస్టుల్లో పది వేల పరుగులకు పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా యూనిస్ ఖాన్కు పేరుంది.

కోచింగ్పై ఆసక్తి ఉందన్న యూనిస్ ఖాన్
యూనిస్ ఖాన్ ఇప్పటికే తనకు కోచింగ్పై ఆసక్తి ఉందని చెప్పాడు. అయితే ఈ విషయంలో బోర్డు తనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని అతడు స్పష్టం చేయడం విశేషం. దీనిపై పీసీబీ చీఫ్ ఎహసాన్ మని మాట్లాడుతూ "ఆస్ట్రేలియా రాడ్నీ మార్ష్, అలన్ బోర్డర్, రిక్కీ పాంటింగ్లాంటి మాజీ క్రికెటర్ల సేవలను వినియోగించుకుంది. టీమిండియా ద్రవిడ్తో అండర్ 19 క్రికెటర్లకు కోచింగ్ ఇప్పించడం వల్ల మంచి ఫలితాలు సాధించింది" అని అన్నారు.

అండర్-19, ఇండియా-ఎ జట్లకు కోచ్గా ద్రవిడ్ సక్సెస్
రాహుల్ ద్రవిడ్ ఇండియా అండర్-19, ఇండియా-ఎ జట్లకు కోచ్గా ఎంతో సక్సెసయ్యాడు. ద్రవిడ్ కోచింగ్లోనే గతేడాది ఇండియా అండర్-19 వరల్డ్కప్ నెగ్గింది. ఇక, పాంటింగ్ విషయానికి వస్తే క్రికెట్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ వరకు జాతీయ జట్టుకు అసిస్టెంట్ కోచ్గా నియమించుకుంది. దీంతో పాక్ కూడా మాజీలను శిక్షణ కోసం వినియోగించుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్గా మహ్మద్ యూసుఫ్ను నియమించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications