హైదరాబాద్: మణికట్టు స్పిన్నర్లు యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్లు పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేస్తుండటంతో వన్డే జట్టులో వెటరన్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా పునరాగమనంపై అభిమానుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే.
అయితే, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ 2019లో జరగబోయే ప్రపంచకప్ రేసులో ఉన్నారని భారత జట్టు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా సఫారీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. సఫారీ పర్యటనలో మణికట్టు స్పిన్నర్లు చాహల్, కుల్దీప్లు విజృంభిస్తున్నారు.
ఆరు వన్డేల సిరిస్లో ఇప్పటివరకు జరిగిన మూడు వన్డేల్లో వీరిద్దరూ కలిసి 21 వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. దీంతో కేప్టౌన్లో మూడో వన్డేలో విజయానంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ స్పిన్ ద్వయం చాహల్, కుల్దీప్పై ప్రశంసల వర్షం కురిపించాడు. దీంతో 2019 వరల్డ్ కప్లో అశ్విన్, జడేజాలకు డోర్లు మూసుకుపోయయంటూ వార్తలు వచ్చాయి.
వీటిపై తాజాగా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ దీనిపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'వరల్డ్ కప్ కోసం జట్టును ఎంపిక చేసే సమయంలో అందరినీ దృష్టిలో పెట్టుకుంటాం. ఆటగాళ్ల ప్రతిభ ఆధారంగానే జట్టు ఎంపిక జరుగుతుంది. కాబట్టి అశ్విన్, జడేజా కూడా ప్రపంచకప్ రేసులో ఉన్నట్లే. వారి కోసం తలుపులు తెరిచే ఉన్నాయి' అని అన్నాడు.
'ప్రస్తుతం భారత జట్టులో స్థానం కోసం విపరీతమైన పోటీ నెలకొంది. మంచి ప్రదర్శన చేయకపోతే బెంచ్కే పరిమితమైపోతామని వారికి తెలుసు. అందుకే ఆటగాళ్లు పోటీని తట్టుకునేందుకు స్థాయికి మించి ప్రదర్శన చేస్తున్నారు. లంకతో సిరీస్ సమయంలో మన ఆటగాళ్ల ప్రతిభను గుర్తించేందుకు ప్రయత్నాలు చేపట్టాం. ఇందులో విజయవంతమయ్యాం. ఎంతో మంది ప్రతిభ గల బౌలర్లు ఇప్పుడు మన వద్ద ఉన్నారు' అని అన్నాడు.
ఆరు వన్డేల సిరిస్లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారం జోహెన్స్ బర్గ్లోని వాండరర్స్ స్టేడియంలో నాలుగో వన్డే జరగనుంది. ఈ సిరిస్లో ఇప్పటివరకు జరిగిన మూడు వన్డేల్లో భారత్ విజయం సాధించి 3-0 ఆధిక్యంలో నిలిచింది. శనివారం జరిగే నాలుగో వన్డేలో విజయం సాధిస్తే సఫారీ గడ్డపై కోహ్లీసేన వన్డే సిరిస్ను గెలిచి చరిత్ర సృష్టిస్తుంది.