టీమిండియా ఏ పెద్ద టోర్నీలో విఫలమైనా సరే.. అందరూ ఐపీఎల్ను తప్పుపడుతుంటారు. ఆటగాళ్లు ఐపీఎల్ కోసం చాలా కష్టపడతారని, దేశం తరఫున ఆడేటప్పుడు అంత కమిట్మెంట్ చూపించరని విమర్శలు వెల్లువెత్తాయి. జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా జట్టుకు దూరమైనప్పుడు కూడా ఐపీఎల్ కోసమైతే బుమ్రా గాయాలైనా ఆడతాడని, దేశం కోసమైతే గాయం అవుతుందని కొందరు విమర్శించారు.
ఇలా ఐపీఎల్పై విమర్శలు రావడాన్ని మాజీ లెజెండ్ గౌతమ్ గంభీర్ తిప్పికొట్టాడు. భారత క్రికెట్కు ఐపీఎల్ ఎంతో మేలు చేసిందని కొనియాడిన ఈ లెజెండరీ ఓపెనర్.. ఈ క్యాష్ రిచ్ లీగ్ను విమర్శించడం సరికాదన్నాడు. 'ఒక క్రీడాకారుడు తనకు 35-36 సంవత్సరాల వయసు వచ్చే వరకే సంపాదించుకునే అవకాశం ఉంటుంది. వాళ్లకు ఇలా ఆర్థిక బలాన్ని అందించడంలో ఐపీఎల్ చాలా ఉపయోగపడింది' అని చెప్పాడు.
'భారత క్రికెట్లో జరిగిన అతిపెద్ద మంచి పని ఐపీఎల్. దీన్ని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా భారత జట్టు సరిగా ఆడకపోతే ఐపీఎల్ను బ్లేమ్ చేయడం అందరికీ అలవాటు అయిపోయింది. ఐసీసీ టోర్నమెంట్లలో మనం రాణించకపోతే ఆటగాళ్లను తిట్టండి. వాళ్ల ప్రదర్శనను తప్పుబట్టండి. అంతేకానీ, ఐపీఎల్ మీద పడి ఏడవడం కరెక్ట్ కాదు' అని తేల్చిచెప్పాడు.
ఐపీఎల్లో 2011 నుంచి 2017 వరకు కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు సారధిగా ఉన్నాడీ లెజెండరీ బ్యాటర్. ఈ లీగ్లో అత్యంత సక్సెస్ఫుల్ కెప్టెన్లలో ఒకడిగా పేరొందాడు. 2012, 2017 సీజన్లలో రెండుసార్లు ట్రోఫీ నెగ్గాడు. అంతేకాదు, 2016, 2017 సీజన్లలో కూడా జట్టును ఫైనల్ వరకూ తీసుకెళ్లాడు. కానీ ఈ రెండు సీజన్లలో ట్రోఫీని ముద్దాడలేకపోయాడు. ఐపీఎల్ మొదలైన తర్వాత భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలవలేకపోయింది. ధోనీ నాయకత్వంలో 2013 ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన తర్వాత మరో ఐసీసీ టోర్నీ కూడా నెగ్గలేదు.