
హైదరాబాద్: ఒమన్, యూఏఈలో త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకుంటున్న విషయం తెలిసిందే. రవిశాస్త్రి పదవీకాలం నవంబరు 14తో ముగియనుంది. దాంతో మెగా టోర్నీ తర్వాత భారత జట్టుకు కొత్త హెడ్ కోచ్ రానున్నాడు. ఇక టీమిండియాకు కొత్త కోచ్ని ఎంపిక చేయడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. ఈ క్రమంలో టీమిండియా తదుపరి కోచ్ ఎవరనే అంశంపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే, హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ తదితరుల పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి.
తాజాగా భారత క్రికెట్ దిగ్గజం, మాజీ సారథి రాహుల్ ద్రవిడ్కు టీమిండియా హెడ్ కోచ్ పదవిని కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని వార్తలొచ్చాయి. అందుకు బీసీసీఐ పెద్దలు భారీ ప్రయత్నాలే చేశారని గతంలో ఓ టాక్ కూడా వచ్చింది. అయితే బీసీసీఐ ఆఫర్ను 'ది వాల్' సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం తెలుస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే తాను కోచ్గా సాధించిన ఘనతల పట్ల సంతృప్తిగా ఉన్నానని తెలపడం వల్ల అతడిని మరోసారి కోచ్గా ఎంపిక చేసే ఉద్దేశ్యం లేనట్లే తెలుస్తోంది.
ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో భారత కుర్రాళ్లకు శిక్షణ ఇచ్చే బాధ్యతను రాహుల్ ద్రవిడ్ భుజాలకెత్తుకొన్నాడు. దీంతో పాటు అండర్-19 భారత జట్టు, ఇండియా ఎ జట్లకు కూడా కోచ్గా ఉన్నాడు. ఇక ఈ ఏడాది జులైలో శిఖర్ ధావన్ నాయకత్వంలోని భారత జట్టు శ్రీలంకలో పర్యటించింది. అప్పుడు కూడా ద్రవిడే కోచ్గా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి తప్పుకోగానే కోచ్ పదవిని ద్రవిడ్కు అప్పగించాలని బీసీసీఐ భావించింది. కానీ ద్రవిడ్ మాత్రం దీనికి సుముఖంగా లేనట్లు సమాచారం. 2016, 2017లోనూ టీమిండియా ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టాలని ద్రవిడ్ను బీసీసీఐ కోరింది. అప్పుడు కూడా ఈ వినతిని అతడు సున్నితంగా తిరస్కరించాడు.
టీ20 ప్రపంచకప్ ముగియగానే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని విరాట్ కోహ్లీ కూడా ఇప్పటికే ప్రకటించాడు. అలాగే కోచ్ పదవి నుంచి తప్పుకుంటానని రవిశాస్త్రి కూడా ఎప్పుడో వెల్లడించాడు. రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ కూడా బాధ్యతల నుంచి తప్పుకుంటారని సమాచారం. భారత జట్టు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ నిక్ వెబ్ కూడా ఈ మెగా టోర్నీ తర్వాత జట్టును వీడనున్నాడు. అయితే బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మాత్రం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇక టీ20 ప్రపంచకప్ కోసం ఐపీఎల్ 2021 రూపంలో భారత్ సిద్ధమవుతోంది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు యూఏఈ వేదికగా మెగా టోర్నీ జరగనుంది. భారత్ అక్టోబర్ 24న తమ మొదటి మ్యాచులో పాకిస్థాన్తో తలపడనుంది.