'అతడి ఆట అద్భుతం... సందర్భాన్ని బట్టి ఎలా ఆడాలో ధోనికి తెలుసు'


హైదరాబాద్: అడిలైడ్ వన్డేలో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రెండో వన్డేలో ధోని ఆట అద్భుతమని... ధోని సందర్భానికి తగిన విధంగా ఆడతాడని ఆస్ట్రేలియా మాజీ పేసర్ జాసన్ గిలెస్పీ ప్రశంసించాడు.
పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో గిలెస్పీ మాట్లాడుతూ "మ్యాచ్లు ముగించడంలో ధోనికి ఉన్న నైపుణ్యంతో భారత్ దశాబ్ద కాలంగా లాభం పొందుతుంది. ఇప్పటికీ టీమిండియా ధోని ద్వారా ఆ ప్రయోజనం పొందుతోంది. సిడ్నీ వన్డేలో 4/3తో ఉన్నప్పుడు అదే ధోని అనుభవంతో జట్టు పుంజుకుంది" అని అన్నాడు.

సిడ్నీలో ధోని నెమ్మదిగా
"సిడ్నీలో ధోని నెమ్మదిగా ఆడినప్పటికీ ఎందుకలా ఆడాడో మనం అర్థం చేసుకోవచ్చు. పరిస్థితిని అనుసరించి ఆడాడు. మిడిలార్డర్లో వచ్చి భిన్నమైన పరిస్థితుల్లో ఆడటం చాలా కష్టం. అతడు 300 పైగా వన్డేలు ఆడాడు. ఎప్పుడెలా ఆడాలో ధోనీకి బాగా తెలుసు" అని గిలెస్పీ కొనియాడాడు.

కోహ్లీపై కూడా గిలెస్పీ ప్రశంసల వర్షం
ఇక, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై కూడా గిలెస్పీ ప్రశంసల వర్షం కురిపించాడు. "కోహ్లీ నుంచి మరో అద్భుతమైన ఇన్నింగ్స్. అందరి కన్నా అతడెంతో భిన్నం. గణాంకాలే అతడి గురించి చెబుతాయి. మనం ప్రత్యేకంగా అతడి గురించి చెప్పాల్సిన పనిలేదు. 39 సెంచరీలు, సచిన్ కన్నా 50 తక్కువ ఇన్నింగ్సుల్లోనే 10,000 పరుగులు చేశాడు" అని పేర్కొన్నాడు.

కోహ్లీ గొప్పగా ఆడుతున్నాడు
"సచిన్ ఎంతమంచి ఆటగాడో మనందరికీ తెలుసు. కోహ్లీ ఇంకా గొప్పగా ఆడుతున్నాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అతడే అత్యుత్తమం. టీమిండియా మిడిలార్డర్ బాగాలేదని చెప్పను. మంచి బ్యాట్స్మన్తో సమతూకంగా ఉంది. ధోనీ, అంబటి రాయుడు ఉన్నారు. జట్టు విరాట్ కోహ్లీపై కాస్త అతిగా ఆధారపడుతున్నా మిడిలార్డర్ బాగుంది" అని గిలెస్పీ అన్నాడు.

జనవరి 18న మూడో వన్డే
ఈ సిరిస్లో ధోని వరుసగా రెండు హాఫ్ సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. అడిలైడ్ వన్డేలో భారత్ విజయం సాధించడంతో వన్డే సిరీస్ను 1-1తో సమం అయింది. ఆసీస్ నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే భారత్ ఛేదించి సంగతి తెలిసిందే. ఈ సిరిస్లో చివరిదైన మూడో వన్డే మెల్బోర్న్ వేదికగా జనవరి 18న జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications