మళ్లీ ఫామ్లోకి రావడంపై సీక్రెట్ వెల్లడించిన శిఖర్ ధావన్


హైదరాబాద్: వన్డే వరల్డ్కప్ ముంగిట ఓపెనర్ శిఖర్ ధావన్ ఫామ్ అందుకోవడం టీమిండియాకి గొప్ప ఊరటనిస్తోంది. గత ఆరు నెలల్లో అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఒక్క సెంచరీ కూడా చేయని శిఖర్ ధావన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో వరల్డ్కప్ జట్టులో శిఖర్ ధావన్కు చోటు దక్కడం అనుమానమేనంటూ వార్తలు కూడా వచ్చాయి.
అయితే, తనపై వచ్చిన విమర్శకులకు ధావన్ తన బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. ఆదివారం మొహాలి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో శిఖర్ ధావన్ సెంచరీతో చెలరేగిపోయాడు. 143 పరుగులతో కెరీర్లోనే అత్యధిక స్కోరు నమోదు చేశాడు. చివరి 17 ఇన్నింగ్స్ల్లో అతనికి ఇదే తొలి శతకం కావడం విశేషం.

ఈ ఏడాది 11 వన్డేలాడిన శిఖర్ ధావన్
ఈ ఏడాది 11 వన్డేలాడిన శిఖర్ ధావన్ వరుసగా 0, 32, 23, 75*, 66, 28, 13, 6, 0, 21, 1 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలతో పాటు.. రెండు డకౌట్స్ కూడా ఉన్నాయి. దీంతో పాటు చివరి ఆరు మ్యాచ్ల్లోనూ కనీసం ఒక 50+ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పలేకపోయాడు.

ప్రపంచకప్లో ఆడటంపై సందేహాలు
దీంతో ధావన్ ప్రపంచకప్లో ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. తాజాగా మెరుపు సెంచరీతో ప్రపంచకప్ బెర్తుని ధావన్ ఖాయం చేసుకున్నాడు. గత ఆరు నెలలుగా ఫామ్ కోల్పోయారు.. మీపై వచ్చిన విమర్శల్ని ఎలా తీసుకున్నారు? అని శిఖర్ ధావన్ను ప్రశ్నించగా తనదైన శైలిలో స్పందించాడు.

న్యూస్ పేపర్స్ చదవను
"నేను న్యూస్ పేపర్స్ చదవను. నాకు అవసరం లేని విషయాల్ని దరిచేరనివ్వను. ముఖ్యంగా తాను విమర్శలకు స్పందించను. కాబట్టి.. నాపై వచ్చే విమర్శల గురించి నాకు తెలిసే అవకాశమే లేదు. ఆలోచనలకి అనుగుణంగా నా ప్రపంచంలో నేను జీవిస్తుంటాను. ఏదైన అంశం నన్ను బాధిస్తే? వెంటనే దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తా" అని అన్నాడు.

ఆత్మవిశ్వాసంతో ఉండేందుకు ప్రయత్నిస్తా
"నిజాయతీగా నాపై వచ్చే విమర్శలు గురించి నాకు తెలీదు. కానీ.. ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉండేందుకు ప్రయత్నిస్తా. నా ప్రపంచంలో నేను ఉండటం వల్ల మనస్సును ప్రశాంతంగానే ఉంచుకోగలను" అని శిఖర్ ధావన్ స్పష్టం చేశాడు. మొహాలి వేదికగా ఆదివారం జరిగిన నాలుగో వన్డేలో 358 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ.. పేలవ బౌలింగ్, ఫీల్డింగ్ కారణంగా టీమిండియా 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

ఐదు వన్డేల సిరీస్ 2-2తో సమం
359 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఇంకా 13 బంతులు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఐదు వన్డేల సిరీస్ 2-2తో సమం అయింది. సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే ఐదో వన్డే ఢిల్లీ వేదికగా బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications