ధోనీని కట్టడి చేయాలంటే?:
ఎంఎస్ ధోనీని డెత్ ఓవర్లలో కట్టడి చేయాలంటే ఎలాంటి బంతి విసరాలి అని బౌలర్లు అందరూ తికమక పడుతున్నారు. అయితే ఈ ప్రశ్నని నేరుగా అతడినే అడిగేశాడు టీమిండియా స్టార్ పేసర్ దీపక్ చహర్. అయితే మహీ మాత్రం అసలు సమాధానం చెప్పకుండా.. రివర్స్లో జావాబిచ్చాడు. చహర్ ఈ విషయాన్ని పసిగట్టేశాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో చహర్ మాట్లాడుతుండగా.. డెత్ ఓవర్లలో ధోనీని కట్టడి చేయాలంటే మీరు ఏ బంతిని సాధిస్తారు? అని ఓ అభిమాని అడిగాడు. నాలుగు రోజుల ముందు అదే ప్రశ్నని ధోనీన నేను అడిగేసాగాను అని అతడు తెలిపాడు.
నకుల్ బాల్ మంచి ఆప్షన్:
'ఎంఎస్ ధోనీని నేను ఆ ప్రశ్న అడిగా. "నకుల్ బాల్ మంచి ఆప్షన్" అని సమాధానమిచ్చాడు. కానీ ఆ బంతిని నేను విసిరితే నువ్వు అత్యంత ఈజీగా స్టేడియంలోకి సిక్స్గా కొట్టేస్తావ్ అని నవ్వేశా. ఇలా ధోనీని సరదాగా ఆటపట్టించా' అని చాహర్ చెప్పాడు. 'డెత్ ఓవర్లలో ధోనీ ఓ వ్యూహం ప్రకారం హిట్టింగ్ చేస్తాడు. ఆ సమయంలో అతడిని ఔట్ చేయాలంటే కష్టమే. కానీ మహీని కట్టడి చేయాలంటే.. వైడ్ యార్కర్ లేదా వైడ్ స్లోయర్ బౌన్సర్ వేయాలి' అని చహర్ చెప్పుకొచ్చాడు.
చెన్నై తరఫునే ధోనీ, చహర్:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫునే ఎంఎస్ ధోనీ, దీపక్ చహర్ ఆడుతున్న విషయం తెలిసిందే. మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభంకావాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా టోర్నీని బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. చహర్ టీ20 స్పెషలిస్ట్ బౌలర్. మొత్తం 10 అంతర్జాతీయ టీ20లు ఆడిన దీపక్.. 7 ఎకనామితో 17 వికెట్లు పడగొట్టాడు. ఇక మూడు వన్డేలలో రెండు వికెట్లు పడగొట్టాడు.
వెన్ను గాయంతో దూరం:
గత ఏడాది డిసెంబర్లో వెస్టిండీస్ జట్టుతో జరిగిన సిరీస్లో దీపక్ చహర్ గాయడ్డాడు. దీంతో అప్పటి నుండి జట్టుకు దూరమయ్యాడు. వెన్ను గాయంతో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం తీసుకున్నాడు. అక్కడ ఫిట్నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమించాడు. కరోనా కారణంగా మూడు నెలలు బ్రేక్ రావడంతో ఇప్పుడు అతను వెన్ను గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు అతడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2019 ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 17 మ్యాచ్లాడిన చహర్.. 22 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. ఇదే అతని కెరీర్లో టర్నింగ్ పాయింట్. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పర్యవేక్షణలో చెన్నైకి ఆడుతూ రాటుదేలిన దీపక్ చహర్.. అద్భుత బౌలింగ్తో బీసీసీఐ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. దీంతో భారత జట్టులోకి అరంగేట్రం చేసే అవకాశాన్ని అందుకున్నాడు.