ప్రపంచకప్ నిర్వహణపై నీలినీడలు:
రోనా వైరస్ కారణంగా మెగా టోర్నీ టీ20 ప్రపంచకప్ నిర్వహణపై ప్రస్తుతం నీలినీడలు కమ్ముకున్నాయి. ఐసీసీ, సీఏ టోర్నీ నిర్వహణపై మల్లగుల్లాలు పడుతోంది. ఈ నేపథ్యంలో కామెంటేటర్ డీన్ జోన్స్ సరికొత్త ప్రతిపాదన తెరమీదకు తెచ్చాడు. కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉన్న న్యూజిలాండ్లో టీ20 ప్రపంచకప్ జరుగొచ్చని బుధవారం ట్వీట్ చేశాడు.
న్యూజిలాండ్లో జరగొచ్చు:
న్యూజిలాండ్లో కరోనా ప్రభావం తక్కువగా ఉండడం సహా 12రోజులుగా ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. దీంతో కొత్త కేసులు రాకపోతే వచ్చే వారం నుంచి ప్రజలు గుమికూడేందుకు కూడా అనుమతిస్తామని ఆ దేశ ప్రధాని జెసిండా అడెర్న్ ఇటీవల చెప్పారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు దగ్గరలో ఉన్న న్యూజిలాండ్లో టోర్నీ జరుగొచ్చని జోన్స్ అభిప్రాయపడ్డాడు. 'వచ్చే వారం అలెర్ట్ లెవెల్-1కు న్యూజిలాండ్ వెళ్లొచ్చని ప్రధాని చెప్పారు. భౌతిక దూరం నిబంధనలతో పాటు జన సమూహాలపై విధించిన నిషేధం కూడా తొలగిపోతుందన్నారు. అక్కడ టీ20 ప్రపంచకప్ జరుగొచ్చు' అని జోన్స్ ట్వీట్ చేశాడు.
న్యూజిలాండ్లో వైరస్ ప్రభావం తక్కువే:
న్యూజిలాండ్లో కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తక్కువగా ఉంది. ఇక 12 రోజులుగా ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. మరోవైపు ఆస్ట్రేలియాలో కూడా వైరస్ కేసులు ఏడు వేలకు పైగా మాత్రమే ఉన్నాయి. అయితే ఖాళీ స్టేడియాల్లో మ్యాచులు నిర్వహించేందుకు సీఏ సిద్ధంగా లేదు.
టోర్నీ నిర్వహణ ఆస్ట్రేలియాకి ప్రమాదకరం:
ఆస్ట్రేలియా గడ్డపై మెగా టోర్నీ నిర్వహించడం ఆ దేశానికి ప్రమాదకరమని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో కెవిన్ రోబర్ట్స్ తాజాగా అభిప్రాయపడ్డాడు. 'అక్టోబరు-నవంబరు నాటికి పరిస్థితులు అదుపులోకి వస్తాయని అప్పట్లో ఆశించాం. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంక్లిష్ట పరిస్థితుల దృష్ట్యా 16 క్రికెట్ జట్లని ఆస్ట్రేలియాలోకి అనుమతించడం చాలా రిస్క్తో కూడుకున్నది. .మెగా టోర్నీని షెడ్యూల్ ప్రకారం నిర్వహించలేం. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి లేదా అక్టోబరు-నవంబరు నెలల్లో టోర్నీని నిర్వహించేందుకు ఉన్న అవకాశాల్ని పరిశీలిస్తాం' అని కెవిన్ తెలిపాడు.