'పంత్, రాహుల్ వైపే సెలక్టర్లు.. ఐపీఎల్లో ధోనీ విఫలమైతే పునరాగమనం కష్టమే'

సిడ్నీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మళ్లీ భారత్ తరపున క్రికెట్ ఆడతాడా?.. మళ్లీ బ్యాట్ పట్టుకుని మైదానంలో దిగుతాడా? సగటు భారత క్రికెట్ అభిమాని మనసులో మెదులుతున్న ప్రశ్నలివి. 2019 ప్రపంచకప్ సెమీ ఫైనల్ ఓటమి తరువాత ధోనీ మళ్లీ బ్యాట్ పట్టింది లేదు. దాంతో కొన్ని నెలల క్రితం బీసీసీఐ ప్లేయర్ కాంట్రాక్ట్ లిస్ట్ లోనుంచి కూడా ధోనీని తొలగించింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2020తో పునరాగమనం చేద్దామనుకున్న ధోనీకి కరోనా వైరస్ ఆశాభంగం కలిగించింది. లాక్డౌన్ కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్ 13వ సీజన్పై స్పష్టత రావడంతో.. అందరి కళ్లూ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోనీపై పడ్డాయి.

భారీ అంచనాలు
సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8వరకు ఐపీఎల్ 2020ని యూఏఈలో నిర్వహిస్తున్నట్లు గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ శుక్రవారం మీడియాకు తెలిపారు. దీంతో దాదాపు ఏడాది కాలంగా క్రికెట్కు దూరమైన ధోనీపై ఆయన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ ఐపీఎల్లో రాణించి మళ్లీ జాతీయ జట్టులోకి వస్తాడని ఆశగా వేచిచూస్తున్నారు. అయితే ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ స్పందించారు. ఒకవేళ ధోనీ ఐపీఎల్లో చెలరేగితే పునరాగమనానికి అవకాశాలు ఉన్నాయని, విఫలమైతే మాత్రం కచ్చితంగా భారత తలుపులు మూసుకుపోతాయన్నారు.

ఐపీఎల్లో సరిగ్గా ఆడకపోతే
'ప్రస్తుత పరిస్థితుల్లో భారత సెలక్టర్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఒకవేళ ఎంఎస్ ధోనీ ఈ ఐపీఎల్లో చెలరేగితే.. అతడి పునరాగమనానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మహీ విఫలమైతే మాత్రం కచ్చితంగా టీమిండియా తలుపులు మూసుకుపోతాయి. ఇప్పటికైతే మహీకి అవకాశం ఉంది. ఈ విరామం కూడా అతడికి కలిసిరావొచ్చు. మహీకి ఇప్పటికే మంచి విశ్రాంతి దొరికింది. అయితే ఒక విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలను. వయసు పెరిగే కొద్దీ ఒక ఆటగాడు విరామం తీసుకొని మళ్లీ రాణించడం చాలా కష్టం' అని డీన్ జోన్స్ తెలిపారు.

ఫినిషర్ లేకపోవడం సమస్యే
'ఎంఎస్ ధోనీ ఒక సూపర్స్టార్. అతడో గొప్ప ఆటగాడు. అయితే ఇప్పుడు మాత్రం టీమిండియా.. పంత్, రాహుల్ వైపే చూస్తుంది. ఇకపోతే భారత జట్టుకు అసలైన సమస్య మంచి ఫినిషర్ లేకపోవడమే. ఆ విషయంలో హార్దిక్ పాండ్యను తీసుకుంటే సరిపోతుంది' అని డీన్ జోన్స్ చెప్పారు. అంతర్జాతీయ కెరీర్లో ఎంఎస్ ధోనీ ఇప్పటివరకు 90 టెస్టుల్లో, 350 వన్డేల్లో, 98 టీ20 మ్యాచ్ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 4876, వన్డేల్లో 10773, టీ20ల్లో 1617 రన్స్ చేశాడు.

వారం ముందుగానే యూఏఈకి
ఏడాది పాటు ఆటకు దూరమైన ఎంఎస్ ధోనీ మార్చిలో చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన శిక్షణా శిబిరంలో సాధన చేశాడు. ఆపై వైరస్ కారణంగా రాంచికి వెళ్ళిపోయాడు. అక్కడ ఎంతో కష్టపడ్డాడని తోటి ఆటగాళ్లు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. ఇక ఇప్పుడు ఐపీఎల్ తేదీలు ఖరారవడంతో ఈసారి మహీ ఇతర ఫ్రాంచైజీల కంటే ఓ వారం ముందుగానే యూఏఈకి చేరుకోనున్నట్టు సమాచారం. ధోనీతో సహా చెన్నై ఆటగాళ్లు అందరూ ఆగస్టు రెండవ వారంలో యూఏఈకి చేరుకోనున్నారు. ప్రాక్టీస్, అక్కడి పరిస్థితులకు అలవాటు పడటానికే ముందుగా వెళుతున్నాడట.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
కీమర్ రోచ్ అరుదైన రికార్డు.. 1994 తర్వాత ఇదే తొలిసారి!!