న్యూఢిల్లీ: ఢిల్లీ డేర్ డెవిల్స్ చేతిలో ముంబై ఇండియన్స్ 37 పరుగులతేడాతో ఓడిపోయింది. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో వరుసగా తొమ్మిది మ్యాచుల్లో ఓడిన ఢిల్లీ ఎట్టకేలకు విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ శ్రేయాస్ అయ్యర్ 56 బంతుల్లో 83 పరుగులు, డుమిని 50 బంతుల్లో 78 మెరుపులకు తాహిర్ 3/22 విజృంభణతో ఢిల్లీ మంబైని మట్టికరిపించింది.
వరుసగా నాలుగు ఓటముల అనంతరం గత మ్యాచ్లో విజయం సాధించి ఐపీఎల్లో బోణీ కొట్టిన ముంబైకి ఇది మరో షాక్. ఢిల్లీ తమ ముందు ఉంచిన 191 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఓవర్లన్నీ ఆడిన రోహిత్ సేన తొమ్మిది వికెట్లకు 153 రన్స్ మాత్రమే చేసింది.
అంబటి రాయుడు 22 బంతుల్లో 30, కెప్టెన్ రోహిత్ 24 బంతుల్లో 30, పార్థివ్ పటేల్ (28) రాణించారు. యువరాజ్ మరోసారి విఫలమయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్ మూడు, అమిత్ మిశ్రా రెండు వికెట్లు తీసి ముంబైని కట్టడి చేశారు.
కాగా, ఢిల్లీ ఆటగాళ్లు శ్రేయాస్, డుమినిలు రెండో వికెట్కు 154 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. మాథ్యూస్ (8 బంతుల్లో 17) వేగంగా ఆడాడు. హర్భజన్ సింగ్ మూడు వికెట్లు తీశాడు. 2013 నుంచి సొంత మైదానంలో ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లోనూ పరాజయం పాలైన ఢిల్లీకి తొలి గెలుపు దక్కింది. ఈ విజయంతో డుమినీ సేన ఆరు పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. రెండు పాయింట్లతో ఉన్న ముంబై చివరి స్థానానికి పడిపోయింది.