త్రిపాఠి మమ్మల్ని కాపాడాడు:
మ్యాచ్ అనంతరం కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ.. సంతోషం వ్యక్తం చేశాడు. చివరి ఓవర్లోని చివరి రెండు బంతుల్లో మ్యాచ్ ఢిల్లీకే అనుకూలంగా ఉందని, అయితే రాహుల్ త్రిపాఠి తమని కాపాడాడన్నాడు. యువ క్రికెటర్లు స్వేచ్ఛగా వచ్చి ఇలా ఆడటం బాగుందన్నాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే తుది పోరులో ఏమైనా జరగొచ్చని మోర్గాన్ పేర్కొన్నాడు. 'ఈ మ్యాచ్లో చివరి నాలుగు ఓవర్లలో ఏం జరిగిందనేదానిపై మేం సమీక్ష చేసుకుంటాం. జట్టుకు ఓపెనర్లు మంచి భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్పై పట్టు సాధించారు. కానీ చివర్లో వికెట్లు కోల్పోయి చాలా ఇబ్బంది పడ్డాం. అయినా మ్యాచ్ గెలిచి ఫైనల్స్కు చేరినందుకు సంతోషంగా ఉంది. 20వ ఓవర్ చివరి రెండు బంతుల్లో ఆరు పరుగులు అవసరమైన వేళ మ్యాచ్ ఢిల్లీకే అనుకూలంగా ఉంది. కానీ రాహుల్ త్రిపాఠి మమ్మల్ని కాపాడాడు. అతడెన్నో మాకు విజయాలు అందించాడు' అని మోర్గాన్ తెలిపాడు.
తుది పోరులో ఏమైనా జరగొచ్చు:
'యువ క్రికెటర్లు స్వేచ్ఛగా వచ్చి ఇలా ఆడటం బాగుంది. అందుకోసం మా సహాయక సిబ్బంది చాలా కష్టపడ్డారు. వారివల్లే ఈ విజయం సాధ్యమైంది. కోల్కతా జట్టుపై భారీ అంచనాలున్నాయి. కోచ్ బ్రెండన్ మెక్కలమ్ జట్టులో ఉండడం మా అదృష్టం. వెంకటేశ్ అయ్యర్ను గుర్తించి మెక్కలమ్ ప్రోత్సహించడం వల్ల బాగా రాణిస్తున్నాడు. ఎలాంటి వికెట్ మీదైనా అతడు పరుగులు చేస్తున్నాడు. మంచి ఓపెనింగ్ ఇస్తున్నాడు. తొలి ఐపీఎల్ అయినా.. ఎలాంటి బెరుకు లేదు. ఇక చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే తుది పోరులో ఏమైనా జరగొచ్చు' అని కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పేర్కొన్నాడు. మొత్తానికి ఈ పీఎల్లో మరోసారి పాత ఛాంపియన్నే చూడబోతున్నాం. మూడుసార్లు టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్తో.. రెండుసార్లు విజేత కోల్కతా నైట్రైడర్స్ ఫైనల్లో తలపడబోతోంది.
మాటలు రావడం లేదు:
రాహుల్ త్రిపాఠి సిక్స్ కొట్టగానే ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వి షా గ్రౌండ్లోనే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్లోనూ అతడు దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించాడు. ఇక మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా భావోద్వేగానికి గురయ్యాడు. 'ఇప్పుడెంత బాధ ఉందనేది చెప్పలేను. అసలు మాటలు రావడం లేదు. ఎలాగైనా గెలుస్తామనే నమ్మకంతో ఉన్నాం. చివరివరకూ పోరాడాలనుకున్నాం. అందుకు తగ్గట్టే మా బౌలర్లు పట్టుదలగా రాణించారు. దాదాపు మ్యాచ్ను గెలిపించినంత పనిచేశారు. కానీ దురదృష్టం కొద్దీ గెలుపొందలేకపోయాం. మేం బ్యాటింగ్ చేసేటప్పుడు కోల్కతా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. ముఖ్యంగా మధ్య ఓవర్లలో బాగా కట్టడిచేశారు. దాంతో మేం స్ట్రైక్ రొటేట్ చేయలేకపోయాం. అవసరమైన పరుగులు సాధించలేకపోయాం. అదే మాకు పెద్ద లోటుగా మారింది' అని పంత్ చెప్పాడు.