షార్జా: ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ పేసర్ కగిసో రబడా అరుదైన రికార్డు నెలకొల్పాడు. అతి తక్కువ మ్యాచ్ల్లో 50 ఐపీఎల్ వికెట్లను సాధించిన తొలి బౌలర్గా సరికొత్త రికార్డు లిఖించాడు. చెన్నై సూపర్ కింగ్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో ఈ సౌతాఫ్రికా పేసర్ ఈ ఫీట్ సాధించాడు. చెన్నై ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ ఔట్ చేయడం ద్వారా రబడా తన 50వ ఐపీఎల్ వికెట్ మార్కును అందుకున్నాడు. తద్వారా ఇప్పటి వరకు సునీల్ నరైన్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ 50 ఐపీఎల్ వికెట్ల రికార్డు బ్రేక్ చేశాడు.
కోల్కతా నైట్రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ నరైన్ 32 ఐపీఎల్ మ్యాచ్ల్లో ఈ రికార్డు నెలకొల్పగా.. రబడా 27 మ్యాచ్ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. ఈ ఫాస్టెస్ట్ వికెట్ టేకర్స్ లిస్ట్లో రబడా, నరైన్లు తర్వాత మలింగా(33), ఇమ్రాన్ తాహీర్(35), మెక్లీన్గన్(36), అమిత్ మిశ్రా(37)లు ఉన్నారు. కాగా, అతి తక్కువ బంతుల్లో 50 ఐపీఎల్ వికెట్లను సాధించిన ఘనతను కూడా రబడా తన పేరిట లిఖించుకున్నాడు. రబడా 616 బంతుల్లో 50 ఐపీఎల్ వికెట్లను సాధించాడు. ఈ జాబితాలో రబడా తర్వాత మలింగా 749 బంతుల్లో ఈ ఫీట్ సాధించాడు. ఇక నరైన్ 760 బంతుల్లో యాభై వికెట్ల మార్కును చేరాడు.
ఇప్పటికే రబడా 2017 నుంచీ ఇప్పటివరకు వరుసగా 23 మ్యాచ్ల్లో కనీసం ఒక్క వికెటైనా తీసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇదివరకు ఈ రికార్డు వినయ్కుమార్ పేరిట ఉండగా.. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన తమ ఆరో మ్యాచ్తో రబడా అధిగమించాడు. వినయ్ కుమార్ 2012-2013 సీజన్లలో వరుసగా 19 ఇన్నింగ్స్ల్లో వికెట్లు పడగొట్టాడు.
చెన్నై ఆల్రౌండర్ డ్వేన్బ్రావో 2012 నుంచి 2015 వరకు వరుసగా 27 మ్యాచ్ల్లో వికెట్లు తీసి ఈ జాబితాలో టాప్లో ఉన్నాడు. ఇక ముంబై పేసర్ లసిత్ మలింగ 2015-2017 సీజన్ల మధ్య 17 మ్యాచ్ల్లో వికెట్లు పడగొట్టాడు. దాంతో అతడు నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ నేపథ్యంలోనే రబడా ఈ సీజన్లో మరో 5 మ్యాచ్ల్లో వరుసగా వికెట్లు పడగొడితే బ్రావో రికార్డును సైతం అధిగమించే అవకాశం ఉంది.
చెన్నైతో జరిగిన ఈ ఉత్కంఠ పోరులో ఢిల్లీ 5 వికెట్లతో గెలుపొందింది. శిఖర్ ధావన్(58 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్తో 101 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 రన్స్ చేసింది. ఫాఫ్ డుప్లెసిస్(47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 58), అంబటి రాయుడు(25 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్లతో 45 నాటౌట్) రాణించారు.
అనంతరం ఢిల్లీ 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసి సునాయస విజయాన్నుందకుంది. చివర్లో అక్షర్ పటేల్(5 బంతుల్లో 3 సిక్స్లతో 21 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. చెన్నై బౌలర్లలో చహర్ రెండు వికెట్లు తీయగా.. సామ్ కరన్, ఠాకుర్, బ్రావో చెరొక వికెట్ తీశారు. ఈ గెలుపుతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో టాప్లో నిలిచింది. 7 విజయాలతో ప్లే ఆఫ్ బెర్త్ను ఖాయం చేసుకున్నారు.