సిడ్నీ: ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి కరోనా వైరస్ (కోవిడ్-19) కారణంగా అంతర్జాతీయంగా జరగాల్సిన కొన్ని క్రీడా ఈవెంట్లు రద్దు కాగా.. మరికొన్ని వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఇంగ్లాండ్ వేదికగా జులై 17 నుంచి ది హండ్రెడ్ టోర్నీ ఆరంభం కానుంది. అయితే వైరస్ ప్రభావం తగ్గితే.. టోర్నీ జరగనుంది. తాజాగా ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 'ది హండ్రెడ్' లీగ్ నుంచి తప్పుకున్నాడు. కరోనా మహమ్మారి కారణంగా లీగ్ నుంచి తప్పుకోలేదని.. జింబాబ్వేతో వన్డే సిరీస్కు అందుబాటులో ఉండాలనుకుంటున్నట్లు తెలిపాడు.
మొదటి కేసు.. క్రికెటర్కు కరోనా పాజిటివ్!!
ప్రారంభ ఎడిషన్ 'ది హండ్రెడ్' లీగ్లో డేవిడ్ వార్నర్ సదరన్ బ్రేవ్ జట్టు తరఫున ఆడాల్సి ఉంది. నెల రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీకి 125,000 పౌండ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. మే 28న ఈ టోర్నీ ఆరంభం కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా జూలై 17 నుండి ఆగస్టు 15 వరకు టోర్నీ జరగనుందని ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
కరోనా వైరస్ కారణంగా డేవిడ్ వార్నర్ పోటీ నుండి వైదొలిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే కరోనా కారణంగా తప్పుకోలేదని, జింబాబ్వేతో వన్డే సిరీస్ ఉన్న కారణంగా 'ది హండ్రెడ్' లీగ్ ఆడడం లేదని స్పష్టం చేసాడు. 'లీగ్ ప్రారంభ ఎడిషన్లో ఆడాలని నాకు ఉంది. కానీ క్రికెట్ ఆస్ట్రేలియా జింబాబ్వేతో వన్డే సిరీస్ ఉందని సమాచారం ఇచ్చింది. గత 12 నెలలుగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్నాను. కుటుంబం కోసం కూడా సమయం వెచ్చించాలి' అని వార్నర్ చెప్పుకొచ్చాడు.
జులై 17 నుంచి ది హండ్రెడ్ టోర్నీ ఆరంభం కానుంది. ఇంగ్లాండ్ వేదికగా ఈ లీగ్లో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. ఒక ఇన్నింగ్స్కు 100 బంతులు మాత్రమే ఉండడం ఈ లీగ్ ప్రత్యేకత. ఒక్కో బౌలర్ గరిష్టంగా 20 బంతులు మాత్రమే బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రతీ ఇన్నింగ్స్లో మొదటి 25 బంతుల వరకు పవర్ ప్లే ఉంటుంది. టీ20ల్లోనే చెలరేగే ఆటగాళ్లు.. మరి ఇందులో ఇంకా ఎలా ఆడుతారో చూడాలి.