మూడు ఫార్మాట్లలో సెంచరీలు:
తొలి టీ20లో డేవిడ్ వార్నర్ సెంచరీ చేయడంతో.. మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన మూడో ఆస్ట్రేలియా ఆటగాడిగా నిలిచాడు. వార్నర్ కన్నా ముందు మాజీ ఆటగాడు షేన్ వాట్సన్, గ్లెన్ మ్యాక్స్వెల్ మాత్రమే మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసారు. అంతేకాదు టీ20లలో వార్నర్కు ఇదే తొలి సెంచరీ. ఆసీస్ మాజీ విధ్వంసక ఆటగాళ్ళు హేడెన్, గిల్ క్రిస్ట్ లాంటి ఆటగాళ్లు కూడా టీ20లో సెంచరీ చేయలేదు. వారికి సాధ్యం కానీ రికార్డులను ఈ ముగ్గురు అందుకున్నారు.
నిషేధం తర్వాత తొలి టీ20 మ్యాచ్:
బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఏడాది నిషేధం ఎదుర్కొన్న వార్నర్లు తొలిసారి పొట్టి ఫార్మాట్ బరిలో దిగి దుమ్మురేపాడు. అయితే 2019 యాషెస్ సిరీస్లో పరుగులు చేయడంలో మాత్రం ఇబ్బందిపడ్డారు. హెడింగ్లీ వేదికగా జరిగిన మూడో టెస్టులో 61 పరుగులు తప్ప మిగతా అన్ని ఇన్నింగ్స్ల్లోనూ కలిపి కేవలం 31 పరుగులే చేశాడు. మూడు సార్లు డకౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్లోనే వార్నర్ తిరిగి ఫామ్లోకి రావడం ఆసీస్కు కలిసివచ్చింది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ఉన్న విషయం తెలిసిందే.
టీ20ల్లో చెత్త రికార్డు:
ఈ మ్యాచ్లో ఫించ్, వార్నర్, మ్యాక్స్వెల్ ఊచకోత కోయడంతో శ్రీలంక పేసర్ కసున్ రజిత తన ఖాతాలో పేలవమైన రికార్డు వేసుకున్నాడు. రజిత వేసిన నాలుగు ఓవర్ల స్పెల్లో ఏకంగా 75 పరుగులు ఇచ్చాడు. దీంతో టీ20ల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు టర్కీ బౌలర్ తునాహన్ తురాన్ పేరిట ఉండేది. గత ఆగస్టులో చెక్ రిపబ్లిక్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 70 పరుగులు ఇచ్చాడు.
వార్నర్ ఊచకోత:
శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియాకు ఫించ్, వార్నర్లు శుభారంభం అందించారు. వీరిద్దరు మొదటి వికెట్కి 122 పరుగులు జోడించారు. అర్ధ సెంచరీ తర్వాత ఫింట్ ఔట్ కావడంతో బ్యాటింగ్కి వచ్చిన మ్యాక్స్వెల్ కూడా శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. వార్నర్ సెంచరీ.. మ్యాక్స్వెల్ అర్థ శతకాలు సాధించడంతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 233 పరుగులు చేసింది.
99 పరుగులకే పరిమితం:
234 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 99 పరుగులే చేసింది. ఆసీస్ బౌలర్ల ధాటికి లంక బ్యాట్స్మెన్లు విలవిలలాడిపోయారు. శ్రీలంక బ్యాట్స్మెన్లో షనక (17) టాప్ స్కోరర్. ఆసీస్ బౌలర్లలో జంపా మూడు.. స్టార్క్, కమిన్స్ చెరో రెండు వికెట్లు తీశారు. శతకంతో చెలరేగిన డేవిడ్ వార్నర్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. రెండో టీ20 మ్యాచ్ ఈనెల 30న గబ్బాలో జరగనుంది.