
హైదరాబాద్: దక్షిణాఫ్రికా పేసర్లు డేల్ స్టెయిన్, మోర్నీ మోర్కెల్ నుంచి కోహ్లీసేనకు కఠిన సవాల్ తప్పదని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ హెచ్చరించాడు. జనవరి 5 నుంచి దక్షిణాఫ్రికాతో టీమిండియా మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్లో తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సిరిస్పై మీడియాతో భజ్జీ సోమవారం మాట్లాడాడు.
'గత పదేళ్లుగా డేల్ స్టెయిన్ బెస్ట్ బౌలర్గా కొనసాగాడు. ఏ క్రికెటర్కైనా గాయం నుంచి కోలుకుని జట్టులోకి పునరాగమనం చేయడం అంత సులువు కాదు. జింబాబ్వేతో మంగళవారం నుంచి ఆరంభంకానున్న ఏకైక టెస్టులో ఎలాంటి అద్భుతాలు చేస్తాడో చూడాలి. జింబాబ్వేపై బౌలింగ్ ప్రదర్శనతో అతను భారత్కి గట్టి సంకేతాలు ఇవ్వనున్నాడు' అని భజ్జీ పేర్కొన్నాడు.
'మురళీ విజయ్, పుజారా, విరాట్ కోహ్లీ, రహానే, రోహిత్ శర్మతో భారత్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. ప్రస్తుతం ఇంత మంచి బ్యాటింగ్ లైనప్ ప్రపంచ క్రికెట్లో ఓ జట్టుకూ లేదు. కానీ.. వీరికి స్టెయిన్, మోర్నీ మోర్కెల్ టెస్టు సిరీస్లో సవాల్ విసరగలరు. స్టెయిన్తో పాటు మోర్కెల్ను విజయవంతంగా ఎదుర్కోగలిగితే మనదే విజయం' అని హర్భజన్ అన్నాడు.
'పుల్షాట్, కట్ షాట్ను బాగా ఆడే రోహిత్ శర్మను ఆరో స్థానంలో బ్యాటింగ్కు దింపాలి. బౌన్స్ను సమర్ధవంతగా ఎదుర్కొనగలడు. పాండ్యా టాలెంట్ని కలిగి ఉన్నప్పటికీ, రోహిత్ పూర్తిస్థాయి బ్యాట్స్మెన్' అని హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో కోహ్లీసేన ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకపోవడంపై కూడా భజ్జీ స్పందించాడు.
'సఫారీ గడ్డపై తుది సమరానికి ముందు కోహ్లీ సేన వార్మప్ మ్యాచ్ ఆడితే బాగుండేది. టీమ్ మేనేజ్మెంట్ వద్దన్న నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలియదు' అని భజ్జీ అన్నాడు. మంగళవారం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికాకు బయల్దేరనుంది. జనవరి 5న కేప్టౌన్లో తొలి టెస్టు ప్రారంభంకానుంది.
దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా పర్యాటక భారత జట్టు ఆతిథ్య జట్టుతో మూడు టెస్టులు, 6 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.