84 బంతుల్లో 56 పరుగులు:
భారత్ నిర్దేశించిన 353 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వార్నర్ నెమ్మదిగా ఆడాడు. ఏ సమయంలో కూడా దూకుడుగా ఆడలేదు. తన ఆటకు బిన్నంగా.. 84 బంతుల్లో 56 పరుగులు మాత్రమే చేసాడు. ఇందులో కేవలం 5 బౌండరీలు మాత్రమే ఉన్నాయి. వార్నర్ ఆట చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సచిన్ సైతం అతడి ఆటపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
వార్నర్ బ్యాటింగ్ చూసి ఆశ్చర్యపోయా:
మ్యాచ్ అనంతరం సచిన్ మాట్లాడుతూ... 'టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభం నుంచే కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. భువీ, బుమ్రాలు ఆసీస్ ఓపెనర్లను ఒత్తిడికి గురి చేశారు. ముఖ్యంగా భువీ అద్భుత స్పెల్ వేసాడు. వార్నర్ బ్యాటింగ్ చూసి ఆశ్చర్యపోయా. వార్నర్ ఇలా నెమ్మదిగా ఆడటం ఇదివరకు ఎప్పుడూ చూడలేదు. అతడి స్ట్రైక్రేట్ కూడా దారుణంగా ఉంది. ఆసిస్ ఈ మ్యాచ్లో ఆత్మవిశ్వాసం కోల్పోయిందనిపించింది. భారీ లక్ష్యాన్ని కేవలం సింగిల్స్, డబుల్స్ తీస్తూ ఛేదించడం కష్టం' అని సచిన్ పేర్కొన్నారు.
ఆ స్ట్రాటజీతో ఏకీభవిస్తా:
ఆరంభంలో వికెట్లు పోగొట్టుకోకూడదనే ఆస్ట్రేలియా స్ట్రాటజీని నేను ఏకీభవిస్తా. అయితే వారు స్ట్రైక్ రొటేట్ చెయ్యలేకపోవడం భారత్కు కలిసొచ్చింది. స్మిత్ బ్యాటింగ్కు వచ్చాకే స్ట్రైక్ రొటేట్ చేశారు. భారత జట్టు సమష్టి కృషి విజయానికి దోహదం చేసింది. ఇక ఆసీస్ ఫీల్డర్లు వదిలేసిన క్యాచులు కూడా భారత్ ఉపయోగించుకుంది' అని సచిన్ చెప్పుకొచ్చారు.
భారత్ విజయం:
ఈ మ్యాచ్లో భారత్ 36 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (109 బంతుల్లో 117; 16 ఫోర్లు) సెంచరీ చేయగా.. విరాట్ కోహ్లీ(77 బంతుల్లో 82; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (70 బంతుల్లో 57; 3 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ పాండ్యా (27 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) లు రాణించారు. అనంతరం ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 316 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (70 బంతుల్లో 69; 5 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ వార్నర్ (84 బంతుల్లో 56; 5 ఫోర్లు), అలెక్స్ క్యారీ (35 బంతుల్లో 55 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్)లు అర్ధ సెంచరీలు చేశారు. బుమ్రా, భువనేశ్వర్ చెరో 3 వికెట్లు తీశారు.