మిడిలార్డర్ సమస్య:
బౌలింగ్, బ్యాటింగ్లో భారత్కు తిరుగులేదు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లిలతో టాపార్డర్ పటిష్టంగా ఉంది. నాలుగో స్థానంలో దిగనున్న విజయ్ శంకర్ ఇప్పటివరకు మోస్తరు ప్రదర్శనే చేసాడు. ఇక మాజీ కెప్టెన్ ధోనీ బ్యాటింగ్పైనే టీమిండియా మేనేజ్మెంట్ ఆందోళన చెందుతోంది. మిడిలార్డర్లో కీలకమైన ధోనీ విఫలమవుతుండడం కలవరపరుస్తోంది. అఫ్ఘానిస్థాన్తో గత మ్యాచ్లో (52 బంతుల్లో 28 పరుగులు) మరీ నిదానంగా బ్యాటింగ్ చేయడంపై విమర్శలు వచ్చాయి. సచిన్ కూడా ధోనీ బ్యాటింగ్ను తప్పుబట్టాడు. మరి ధోనీ విమర్శలకు చెక్ పెట్టే సమయం వచ్చింది.
షమీకే చోటు:
అఫ్గాన్పై అర్ధ సెంచరీ సాధించిన కేదార్ జాదవ్ కూడా కీలక పాత్ర పోషించాల్సి ఉంది. హార్దిక్ పాండ్యా పించ్ హిట్టర్గా రాణిస్తున్నాడు. ఇక నలుగురు రెగ్యులర్ బౌలర్లతో గత పోరులో భారత బ్యాటింగ్ కొంత బలహీనంగా కనిపించింది. ఈ నేపథ్యంలో ఇద్దరు స్పిన్నర్లలో జడేజాను ఆడించే అవకాశం కూడా ఉంది. పేసర్ భువనేశ్వర్ ఫిట్ అయినా.. తుది జట్టులో అతడికి స్థానం లభించే అవకాశాలు కన్పించడంలేదు. షమీ హ్యాట్రిక్ ప్రదర్శనతో తన చోటు ఖాయం చేసుకున్నాడు. బుమ్రా మరోసారి పదునైన ఆరంభం ఇస్తే విండీస్ను దెబ్బ తీయడం సులువే.
బ్యాటింగ్ విఫలం:
న్యూజిలాండ్తో గత మ్యాచ్లో బ్రాత్వైట్ అద్భుత పోరాట పటిమ చూపడంతో విండీస్ గెలుపు అంచుల దాకా వచ్చి ఓటమి చవిచూడడంతో నిరాశలో కూరుకుపోయింది. ఓపెనర్లు శుభారంభాలు అందించకపోవడం జట్టును దెబ్బతీస్తోంది. మిగిలిన బ్యాట్స్మెన్ కూడా నిలకడగా ఆడకపోవడంతో టోర్నీలో విండీస్ విఫలమయింది. అయితే విండీస్ బ్యాటింగ్ లోతు చివరి వరకు ఉంది. వరుసగా విధ్వంసక ఆటగాళ్లు ఉన్న ఆ జట్టు సమష్టిగా చెలరేగితే.. ఆపడం ఎవరి తరం కాదు. గేల్, హోప్, హెట్మైర్ తమపై ఉన్న అంచనాలకు తగినట్లుగా రాణించాల్సి ఉంది.
పదునైన పేస్:
బ్రాత్వైట్ తన జోరు కొనసాగిస్తే టీమిండియాకు కష్టాలు తప్పవు. కెప్టెన్ హోల్డర్ బ్యాటుతో, బంతితో సత్తా చాటగలడు. ఈ ప్రపంచకప్లో వెస్టిండీస్ పదునైన పేస్ బౌలింగ్తో బరిలోకి దిగింది. కీమర్ రోచ్, కాట్రెల్, ఒషానె థామస్ లాంటి బౌలర్లు ఉన్నారు. కాట్రెల్ ప్రతీ జట్టుపై చెలరేగిపోయాడు. ఆరంభంలో అతని లెఫ్టార్మ్ పేస్ను ఎదుర్కోవడం భారత ఓపెనర్లకు అంత సులువు కాదు.
పిచ్, వాతావరణం
ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానం బ్యాటింగ్కు అనుకూలం. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. వాతావరణం ఎండతో ఉక్కపోతగా ఉండనుంది. పిచ్ పొడిగా ఉండడంతో మ్యాచ్ సాగేకొద్దీ స్పిన్నర్లు ప్రభావం చూపగలరు. టోర్నీలో ఓల్డ్ట్రాఫర్డ్లో జరిగిన మూడు మ్యాచ్ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే గెలుపొందింది. భారత్ ఇదే వేదికపై ఇప్పటికే పాక్తో ఆడగా.. విండీస్ కూడా న్యూజిలాండ్ను ఇక్కడే ఎదుర్కొంది. మ్యాచ్కు వర్షం ముప్పు లేదు.
ముఖాముఖి రికార్డు
భారత్, వెస్టిండీస్ జట్లు ఇప్పటివరకు 126 వన్డేల్లో తలపడ్డాయి. 59 మ్యాచ్ల్లో భారత్, 62 మ్యాచ్ల్లో వెస్టిండీస్ గెలుపొందాయి. రెండు మ్యాచ్లు ‘టై'గా ముగిశాయి. మూడు మ్యాచ్లు రద్దయ్యాయి. ప్రపంచకప్లో రెండు జట్లు ఎనిమిది మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఐదు మ్యాచ్ల్లో భారత్.. మూడు మ్యాచ్ల్లో విండీస్ గెలిచాయి. ప్రపంచకప్లో చివరిసారి 1992లో భారత్పై విండీస్ గెలిచింది. అనంతరం 1996, 2011, 2015 ప్రపంచకప్ మ్యాచ్ల్లో భారత్ను విజయం సాధించింది.
జట్లు (అంచనా):
భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్), విజయ్ శంకర్, ఎంఎస్ ధోనీ, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్/రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.
వెస్టిండీస్: క్రిస్ గేల్, ఎవిన్ లూయిస్/ సునిల్ ఆంబ్రిస్, షాయ్ హోప్ (వికెట్ కీపర్), నికోలస్ పూరన్, హెట్మయెర్, కార్లోస్ బ్రాత్వైట్, జాసన్ హోల్డర్ (కెప్టెన్), ఆష్లే నర్స్, కీమర్ రోచ్, కార్టెల్, ఒషానె థామస్.