అదిరే ఆరంభం:
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ జట్టుకు ఓపెనర్లు జాసన్ రాయ్ (66), జానీ బెయిర్స్టో (111)లు అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడి ఇన్నింగ్స్ ఆరంభం నుండే భారత బౌలర్లను బెంబేలెత్తించారు. ఇద్దరూబౌండరీలు బాదడంలో పోటీ పడడంతో పరుగుల వరద పారింది. వికెట్లు తీసేందుకు కెప్టెన్ కోహ్లీ బౌలర్లను మార్చినా.. ఫలితం లేకుండా పోయింది.
|
తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర:
జేసన్ రాయ్ మీడియం పేసర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఔట్ అయినా.. అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దీంతో రాయ్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సిక్సర్ల వర్షం కురిపించాడు. బెయిర్స్టో స్పిన్నర్ చాహల్ వేసిన 16వ ఓవర్ మూడో బంతిని సిక్సర్గా మలిచి హాఫ్ సెంచరీ చేరుకున్నాడు. 17ఓవర్లో రాయ్ కూడా హాఫ్ సెంచరీ అందుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ స్కోరు 400 పరుగులు దాటుతుందని భావించారు. చివరికి కుల్దీప్ యాదవ్.. జాసన్ రాయ్ (66; 57బంతుల్లో 7×4, 2×6)ను ఔట్ చేసి 160 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు.
|
షమీ విజృంభణ:
మరోవైపు క్రీజులో పాతుకుపోయిన బెయిర్స్టో సెంచరీ (111; 109బంతుల్లో 10×4, 6×6)తో చెలరేగాడు. రూట్ అతనికి చక్కటి సహకారం అందించాడు. అయితే మహ్మద్ షమీ చెలరేగిపోవడంతో ఇంగ్లండ్ పరుగుల వేగం తగ్గింది. షమీ వరుస విరామాల్లో వికెట్లు తీసి ఇంగ్లండ్ను కట్టడి చేశాడు. బెయిర్స్టోను తొలుత వెనక్కి పంపిన షమీ.. ఆ తర్వాత ఇయాన్ మోర్గాన్ (1), జో రూట్ (44), జోస్ బట్లర్ (20), క్రిస్ వోక్స్ (7)లను పెవిలియన్ పంపాడు. అయితే క్రీజులో ఉన్న స్టోక్స్ (79; 54బంతుల్లో 6×4, 3×6) హాఫ్ సెంచరీతో రాణించడంతో ఇంగ్లాండ్ 337 పరుగులు చేసింది. భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లు తీసాడు.