హైదరాబాద్: సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. కెప్టెన్గా ఐపీఎల్ ట్రోఫీని మూడో సారి సొంతం చేసుకోవడమే కాక, మైదానంలో కీపర్ అవతారంలో కనిపించే ధోనీ మరో రికార్డు బద్దలు కొట్టాడు. ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్ను అవుట్ చేసి రికార్డు సృష్టించాడు.
నిదానంగా మొదలైన హైదరాబాద్ ఇన్నింగ్స్ క్రమంగా దూకుడుగా పెంచుతున్న సమయంలో కెప్టెన్ విలియమ్సన్ను ధోనీ స్టంపౌట్ చేశాడు. 12వ ఓవర్ తొలి బంతికి హైదరాబాద్ కెప్టెన్ను కోల్పోయింది. ప్రగాడ నమ్మకంతో హర్భజన్కు బదులుగా బరిలోకి దిగిన కర్ణ శర్మ ఈ మ్యాచ్లో వేస్తున్న రెండో ఓవర్ మొదటి బంతికే హైదరాబాద్ ప్రధాన వికెట్ను తీయగలిగాడు. 12.1వ ఓవర్లకు కేన్ విలియమ్సన్ ఫ్రంట్ ఫూట్కు వెళ్లి షాట్ యత్నించాడు. తృటిలో బాల్ ఎదుర్కోలేకపోవడంతో అది కాస్త ధోనీ చేతిలో పడి స్టంప్ అవుట్ అయి వెనుదిరిగాడు.
విలియమ్సన్ను స్టంపౌట్ చేయడం ద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్టంపౌట్లు చేసిన వికెట్ కీపర్గా ధోనీ రికార్డ్ నెలకొల్పాడు. ఇప్పటి వరకూ ఈ రికార్డ్ రాబిన్ ఉతప్ప (32 స్టంపౌట్లు) పేరిట ఉండగా దాన్ని ధోనీ అధిగమించాడు. మూడో స్థానంలో దినేశ్ కార్తీక్ (30) ఉన్నాడు. డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడిన ఆడమ్ గిల్క్రిస్ట్ 16 స్టంపౌట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
కాగా, ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో చెన్నై హైదరాబాద్పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. సీజన్ ఆరంభం నుంచి బౌలింగే ప్రధాన బలంగా విజయాలను సొంతం చేసుకున్న రైజర్స్ ఈ మ్యాచ్లో తేలిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా 2 ఓవర్లు ఉండగానే మ్యాచ్ దాదాపు చెన్నై చేతికి అప్పజెప్పేశారు. వాట్సన్ దూకుడుకు బెంబేలెత్తేసిన బౌలర్లు ఓటమిని ముందుగానే అంగీకరించారు.