
న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ క్రికెటర్ రాబిన్ ఊతప్ప అన్ని రకాల ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు బుధవారం ట్విటర్ వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. టీమిండియాకు, స్వరాష్ట్ర కర్ణాటకకు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నాని తెలిపాడు. ప్రతీ విషయానికి ఏదో ఒక సమయంలో ముగింపు ఉంటుందని, తాను కూడా భారత క్రికెట్తో ఉన్న అనుబంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నానని ట్వీట్ చేశాడు. తన 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో అండగా నిలిచి ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు.
దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన ఈ కర్ణాటక క్రికెటర్... భారత జట్టులో స్థానాన్ని పదిలపరచుకునే విషయంలో మాత్రం తడబడ్డాడు. బ్యాటర్గానే కాకుండా వికెట్ కీపర్గా, సత్తా కలిగిన ఫీల్డర్గా, బౌలర్గానూ మంచి ప్రావీణ్యం ఉన్న ఊతప్ప.. భారత జట్టు తరఫున 46 వన్డేలు, 12 టీ20 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తనదైన శైలి ప్రతిభ చాటిన ఊతప్ప... ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పూణే వారియర్స్, కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ఆడాడు.
అరంగేట్ర టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాలో ఊతప్ప కీలక సభ్యుడు. పాకిస్థాన్తో జరిగిన ఫస్ట్ మ్యాచ్ టై కాగా.. బౌల్ ఔట్ విధానంతో ఫలితాన్ని నిర్ణయించగా.. అందులో ఊతప్ప బౌలింగ్ చేసి విజయాని బాట వేసాడు. మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఊతప్ప.. 2006లో ఇంగ్లండ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. 46 వన్డేల్లో 6 హాఫ్ సెంచరీలతో 934 పరుగులు చేశాడు. 13 టీ20ల్లో ఓ హాఫ్ సెంచరీ సాయంతో 249 రన్స్ నమోదు చేశాడు. 205 ఐపీఎల్ మ్యాచ్ల్లో 27 హాఫ్ సెంచరీలతో సాయంతో 130.3 స్ట్రైక్రేట్తో 4952 రన్స్ చేశాడు. దూకుడుకు మారుపేరుగా నిలిచిన ఊతప్ప.. అనేక మ్యాచ్ల్లో తాను ప్రాతినిథ్యం వహించిన జట్లను గెలిపించాడు. చెన్నై సూపర్ కింగ్స్ 2021 టైటిల్ గెలవడంలోనూ ఊతప్ప కీలక పాత్ర పోషించాడు.