
హైదరాబాద్: కొన్ని సంవత్సరాలుగా క్రికెట్లో తనదంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నాడు ధోనీ. ప్రస్తుతం కెప్టెన్సీలో లేకపోయినా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సలహాలిస్తూ జట్టును నడిపిస్తుంటాడు. తాజాగా ఐపీఎల్ విజయం తర్వాత చెన్నై కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ వ్యాపార విస్తరణపై దృష్టిసారించారు. ఆయన సహ యజమానిగా వ్యవహరిస్తున్న 'సెవన్' స్టోర్ను నుంగంబాకంలో స్టోర్ను అందుబాటులోకి తెచ్చారు.
ఈ సెవన్ స్టోర్ను చెన్నై సూపర్ కింగ్స్ క్రీడాకారులు మురళీవిజయ్, డ్వైన్ బ్రావో, అంబటి రాయుడులు ప్రారంభించారు. ఇది ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ అధికారిక వ్యాపార భాగస్వామిగా వ్యవహరిస్తోంది. సెవన్ సంస్థ ఇప్పటి వరకు నిర్వహిస్తున్న స్టోర్స్లో ఇదే అతిపెద్దది. మొత్తం రెండు అంతస్తుల్లో ఏర్పాటు చేసిన ఈ దుకాణంలో క్రీడా దుస్తులను విక్రయిస్తారు.
ధోని జీవితంలో అత్యంత విజయవంతమైన ఘట్టాలను ఈ స్టోర్లో ప్రదర్శనకు ఉంచారు. ఇది సెవన్ సంస్థకు చెందిన ఏడో అధికారిక స్టోర్. 2016లో ఆర్ఎస్ సెవన్ లైఫ్స్టైల్ సంస్థతో కలసి ధోనీ సెవన్ సంస్థను ప్రారంభించారు. 2017లో రాంఛీలో దీని తొలి అధికారిక స్టోర్ను ప్రారంభించారు. ఈ సంస్థలో దుస్తుల విభాగం ఆర్ఎస్ లైఫ్స్టైల్ సంస్థకు చెందగా.. బూట్లకు సంబంధించిన విభాగంపై ధోనీకి హక్కులు ఉన్నాయి.