హైదరాబాద్: క్రికెటర్గా కెరీర్ ముగిసిన నాటి నుంచీ కోచ్గానో, వ్యాపారవేత్తగానో కొనసాగడమే కాకుండా రాజకీయాలలో కూడా తమ సత్తా చాటుకునేందుకు ప్లేయర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ క్రికెటర్ మష్రఫే మోర్తాజా క్రికెట్ కెరీర్ ముగియకముందే.. ఆ దేశ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ప్రధాని షేక్ హసీనా ఆహ్వానం మేరకు ఆయన రాజకీయాల్లోకి అరంగ్రేటం చేయనున్నారు. బంగ్లాలో మోర్తాజాకు రాక్స్టార్ గుర్తింపు ఉంది.
హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ తరపున మోర్తజా పోటీ చేయనున్నాడు. డిసెంబర్ 30వ తేదీన పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఆటగాళ్లు రాజకీయాల్లో ప్రవేశించడాన్ని క్రికెట్ బోర్డు వ్యతిరేకించదు అని బంగ్లా క్రికెట్ సంఘం పేర్కొంది. ఎన్నికల్లో పాల్గొనేందుకు మొగ్గు చూపిన మోర్తజా.. నరాలి అనే నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం.
అయితే ఈ వార్తలపై మోర్తజా అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ప్రస్తుతం అతను ఆడుతున్న అవామీ లీగ్ నిర్వహకులు రాజకీయాల్లో పోటీ చేయడంపై ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికార ప్రతినిధి జలాల్ యూనస్ మాట్లాడుతూ.. 'ఎన్నికల్లో పోటీ చేయాలనుంటే అది అతని రాజ్యాంగపరమైన హక్కు. దానిని ఎవ్వరం కాదనలేం. మాకెలాంటి ఇబ్బంది లేదు. అతను క్రికెట్, రాజకీయాలు రెండింటికీ సమన్యాయం చేయగలడని భావిస్తున్నామని' ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే అతని అభిమానుల్లో మాత్రం రాజకీయ అరంగ్రేటం గురించి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. 'నా నిర్ణయం తప్పైనా కావొచ్చు. కానీ, అతను రాజకీయాల్లోకి రావడమనే విషయాన్ని నేను స్వగతించను' అంటూ ఘాటైన కామెంట్లు చేస్తున్నారు. మోర్తజా ఇప్పటికే తన టీ20 కెరీర్కు వీడ్కోలు చెప్పి టెస్టు క్రికెట్కు సైతం 2009 నుంచి దూరంగానే ఉంటున్నాడు.