
హైదరాబాద్: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ తన ప్రొఫెషనల్ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ట్విటర్లో ప్రకటించాడు. కెవిన్ పీటర్సన్ ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టు తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
గురువారం ఇస్లామాబాద్తో తన చివరి లీగ్ మ్యాచ్ ఆడిన క్వెట్టా గ్లాడియేటర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన క్వెట్టా ప్లేఆఫ్ బెర్తును ఖాయం చేసుకుంది. అయితే పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లోని ప్లేఆఫ్స్తో పాటు ఫైనల్ మ్యాచ్ను పాకిస్థాన్లో నిర్వహించాలని పాక్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది.
దీంతో, పాకిస్థాన్లో ఆడేందుకు తనకు ఇష్టం లేదని, భద్రతా కారణాల రీత్యా అక్కడ ఆడేందుకు తాను సిద్ధంగా లేనని పీటర్సన్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. లీగ్ మ్యాచ్లు పూర్తయిన నేపథ్యంలో కెవిన్ పీటర్సన్ ప్రొపెషన్ క్రికెట్లో తన ఆఖరి క్రికెట్ మ్యాచ్ ఆడాడు.
ఈ మ్యాచ్ అనంతరం పీటర్సన్ తన ట్విట్టర్లో "BOOTS UP! Thank you!" అంటూ ట్విట్టర్లో పోస్టు చేశాడు. పీటర్సన్ ట్వీట్పై పలువురు అంతర్జాతీయ క్రికెటర్లతో పాటు మాజీ క్రికెటర్లు అభినందనలు తెలిపారు. ప్రపంచ క్రికెట్లో మోస్ట్ టాలెంటెడ్ బ్యాటర్ అని మాజీ ఇంగ్లాండ్ బౌలర్ సైమన్ జోన్స్ అభివర్ణించాడు.
37 ఏళ్ల కెవిన్ పీటర్సన్ 2014లో తన అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఇంగ్లాండ్ తరఫున 104 టెస్టుల్లో 8181 పరుగులు సాధించాడు. ఇందులో 23 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక, 136 వన్డేల్లో 4440 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
టీ20 ఫార్మాట్లో 37 టీ20 మ్యాచ్లు ఆడగా 7 హాఫ్ సెంచరీలతో 1176 పరుగులు పూర్తి చేశాడు. 2010లో జరిగిన వరల్డ్ టీ20ని గెలిచిన ఇంగ్లాండ్ జట్టులో కెవిన్ పీటర్సన్ సభ్యుడిగా ఉన్నాడు.