హైదరాబాద్: 12వ ఎడిషన్ వరల్డ్కప్ ప్రారంభ వేడుకలు అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రారంభ వేడుకలను సుమారు నాలుగు వేలకు పైగా అభిమానులు హాజరై ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ వేడుకల్లో 60-సెకండ్ ఛాలెంజ్ అమితంగా ఆకట్టుకుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ ప్రారంభ వేడుకలు ముగిసిన తర్వాత వరల్డ్కప్లో పాల్గొనే పది జట్ల కెప్టెన్లు బకింగ్హామ్ ప్యాలెస్లో క్వీన్ ఎలిజబెత్ II ఇచ్చిన పార్టీలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో క్వీన్ ఎలిజబెత్ II, ప్రిన్స్ హ్యారీ పది జట్ల కెప్టెన్లను మర్యాదపూర్వకంగా కలిసి కాసేపు వారితో ముచ్చటించారు.
ప్రిన్స్ హ్యారీకి ఐసీసీ ప్రతినిధి ఒకరు పది జట్ల కెప్టెన్లను పరిచయం చేస్తున్న క్రమంలో ప్రిన్స్ హ్యారీ ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ఫించ్ను స్లెడ్జింగ్ చేశారు. "నువ్వు చాలా పెద్దవాడిలా అయిపోయావ్, నిజమేనా? ఎన్నేళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నావు?" అని జోక్ చేశారు.
ఇందుకు బదులుగా ఆరోన్ ఫించ్ తాను ఎనిమిదేళ్లుగా క్రికెట్ ఆడుతున్నానని చెప్పాడు. ఆ తర్వాత శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నేతో ప్రిన్స్ హ్యారీ మాట్లాడుతూ "ఈ టోర్నీని ఆస్వాదించండి. లేకపోతే మీరు ఇక్కడ ఉండలేరు" అని అన్నాడు. ఈ మెగా టోర్నీలో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది.
సొంతగడ్డపై వరల్డ్కప్ ఆరంభ మ్యాచ్లో ఇంగ్లాండ్ శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. ఓవల్ వేదికగా గురువారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో 104 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లాండ్ విజయంలో ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్, పేసర్ జోఫ్రా ఆర్చర్ కీలకపాత్ర పోషించారు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 311 పరుగులు చేసింది. స్టోక్స్ 79 బంతుల్లో 89 (9 ఫోర్లు), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (57; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), జేసన్ రాయ్ (54; 8 ఫోర్లు), రూట్ (51; 5 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 39.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది.