ఆసియా క్రీడల్లో టీ20లు..
థాయ్ లాండ్ లో 2022లో ఏర్పాటయ్యే ఆసియా క్రీడల్లో టీ20 క్రికెట్ మ్యాచ్ లను నిర్వహించడానికి అనుమతి రావడంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సానుకూలంగా స్పందించింది. ఆసియా క్రీడలకు ఇంకా చాలా సమయం ఉన్నందున.. దీనిపై ఇప్పుడిప్పుడే ఎలాంటి షెడ్యూల్ ను ఖరారు చేయలేమని బీసీసీఐ అధికారులు చెప్పారు. ఒలింపిక్స్ కౌన్సిల్ ఆసియా విభాగం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు వెల్లడించింది. ఆసియా క్రీడల్లో క్రికెట్ ను పున: ప్రవేశపెట్టినప్పటికీ.. 50 ఓవర్ల మ్యాచ్ లు ఉండవు. టీ20 మ్యాచ్ లను మాత్రమే నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం.
ఈ సారి నేపాల్, హాంగ్ కాంగ్ కూడా..
ప్రస్తుతం భారత ఉపఖండంలో మనదేశంతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆప్ఘానిస్తాన్ జట్లు పూర్తిస్థాయిలో క్రికెట్ ఆడుతున్నాయి. 2022 ఆసియా క్రీడల్లో నేపాల్, హాంగ్ కాంగ్ జట్టు కూడా భాగస్వామ్యం అయ్యే వీలుంది. ఈ రెండు జట్లు ఆడటానికి ఐసీసీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.
2018లో తొలగింపు..
ఇండోనేషియాలో ఏర్పాటైన 2018 ఆసియా క్రీడల సందర్భంగా క్రికెట్ ను తొలగించారు. 2010, 2014 ఆసియా క్రీడల బిజీ షెడ్యూల్ ను దృష్టిలో ఉంచుకుని అప్పటి ఒలింపిక్ కౌన్సిల్ ఈ మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. 2018 నాటికి క్రికెట్ లేకుండా ఆసియా క్రీడలను నిర్వహించారు. 50 ఓవర్ల క్రికెట్ ఆడటానికి దాదాపు 12 గంటల సమయం పడుతుండటం, అందుకు తగినన్ని స్టేడియాలు అందుబాటులో లేకపోవడాన్ని దృష్టిలో ఉంచుకుని క్రికెట్ ను తొలగించారు.