కేవలం ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ మాత్రమే ఆడటంతో
కేవలం ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ మాత్రమే ఆడటంతో బ్యాట్స్మెన్ సిరీస్కు సన్నద్ధం కాలేకపోయారనే విమర్శలు వచ్చాయి. దీంతో కీలకమైన ఆస్ట్రేలియా పర్యటనలో ఈ పొరబాట్లు చేయొద్దని కోచ్ రవిశాస్త్రి నిర్ణయించాడు. ఇందులో భాగంగా కోహ్లీసేన త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో సిరీస్ ఆరంభానికి ముందు వార్మప్ మ్యాచ్లను ఆడాలనుకుంటున్నట్లు శాస్త్రి పేర్కొన్నాడు.
ఎక్కువ సన్నాహక మ్యాచ్లు నిర్వహించాలని సీఏను కోరిన రవిశాస్త్రి
ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్కు ముందు ఎక్కువ సన్నాహక మ్యాచ్లు నిర్వహించాలని క్రికెట్ ఆస్ట్రేలియాను రవిశాస్త్రి కోరాడు. టీమిండియా కోచ్ వినతి పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా అధికార ప్రతినిధి సానుకూలంగా స్పందించారు. రవిశాస్త్రి వ్యాఖ్యలపై క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ భారత్ జట్టు కోసం మరిన్ని వామప్ మ్యాచ్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
బీసీసీఐతో చర్చించడానికి సంతోషంగా ఉన్నాం
"ప్రాక్టీస్ మ్యాచ్ల విషయంలో ఉన్న అవకాశాలపై బీసీసీఐతో చర్చించడానికి సంతోషంగా ఉన్నాం. ఆస్ట్రేలియా పర్యటనలో సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియా ఆడనున్న సన్నాహాక మ్యాచ్లను పెంచాలని బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు" అని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రతినిధి పేర్కొన్నారు.
నవంబర్ 21 నుంచి జనవరి 18 వరకు ఆసీస్ పర్యటన
మూడు లేదా నాలుగు రోజుల మ్యాచ్లు ఒకటి రెండు ఎక్కువ ఆడాల్సి వస్తే తీరిక లేని షెడ్యూల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. భారత జట్టు నవంబర్ 21 నుంచి జనవరి 18 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఆస్ట్రేలియా జట్టుతో మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. డిసెంబర్ 6 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం అవుతుంది.