|
భార్య నుంచి వింత అనుభవం
ఇటీవల పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో కరాచీ కింగ్స్ తరఫున మిచెల్ మెక్క్లెనఘన్ ఆడాడు. అయితే కరోనా కారణంగా మెక్క్లెనఘన్ సోమవారం పాక్ నుండి న్యూజిలాండ్లోని తన ఇంటికి చేరుకున్నాడు. ఆదివారం అర్ధరాత్రి నుంచి కివీస్లో అడుగుపెట్టేవారికి 14 రోజులు స్వీయ నిర్బంధం ఉండాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెక్క్లెనఘన్ సోమవారం ఇంటికి చేరకముందే ఆయన సతీమణి జార్జియా పుట్టింటికి వెళ్లింది.
నీ భార్యతోనైనా ఉండలేకపోతున్నావు:
జార్జియా పుట్టింటికి వెళ్తూ ఇంట్లోని ఫ్రిడ్జ్పై ఒక లేఖ రాసిపెట్టింది. అది చూసిన మెక్క్లెనఘన్ షాక్ అయ్యాడు. ఆ లేఖను కివీస్ పేసర్ మెక్క్లెనఘన్ తన ట్విటర్లో అభిమానులతో పంచుకున్నాడు. ఇంతకు అందులో ఏముందంటే.. 'ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నీకు చిరాకు వస్తే.. ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో కదా. కనీసం నీ భార్యతోనైనా ఉండలేకపోతున్నావు. ప్రేమతో నీ భార్య' అని పేర్కొంది.
ప్రేక్షకులు లేకుండా పీఎస్ఎల్:
ప్రాణాంతక వైరస్ కారణంగా పాకిస్థాన్ సూపర్ లీగ్లో మిగిలిన మ్యాచ్లకు ప్రేక్షకులను అనుమతించకుండా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఖాళీ స్టేడియాల్లో టోర్నీని నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే విదేశీ ఆటగాళ్లు స్వదేశాలకు వెళ్లడానికి పీసీబీ అనుమతి ఇచ్చింది. లీగ్ ప్రాంచైజీలను ఒప్పించి మరీ విదేశీ ఆటగాళ్లను స్వదేశాలకు పంపిస్తోంది పీసీబీ. ఈ క్రమంలోనే మెక్క్లెనఘన్ స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యాడు.
ఫెర్గూసన్కు నెగెటివ్:
న్యూజిలాండ్ పేస్ బౌలర్ లాకీ ఫెర్గూసన్కు ఆస్ట్రేలియాతో సిడ్నీలో తొలి వన్డే ఆడిన తర్వాత గొంతు నొప్పికి గురయ్యాడు. దీంతో అప్రమత్తమైన కివీస్ జట్టు మేనేజ్మెంట్ వెంటనే అతడిని ప్రత్యేక వార్డుకు చేర్చింది. కరోనా వైరస్కు సంబంధించి పరీక్షలకు పంపడంతో పాటు.. 24 గంటల పాటు ఎవరితో కలవకుండా హోటల్ రూమ్లోనే నిర్బంధించింది. ఇక శనివారం అతని రిపోర్ట్లు నెగెటివ్గా రావడంతో.. ఫెర్గూసన్తో పాటు కివీస్ బోర్డు ఊపిరి పీల్చుకొంది.