హైదరాబాద్: బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బౌలర్ ఉమేశ్ యాదవ్ జట్టుకు శుభారంభాన్ని అందించాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటి వరకు చూడని షోను ప్రేక్షకులకు చూపించాడు. ముంబై ఇండియన్స్తో వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో తొలి ఓవర్ తొలి రెండు బంతులకే రెండు వికెట్లు తీసి ఔరా.. అనిపించుకున్నాడు.
తొలుత టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్, ఎవిన్ లూయిస్ ముంబై ఇన్నింగ్స్ను ఆరంభించారు. తొలి ఓవర్ వేయడానికి ఉమేశ్ యాదవ్ బంతిని అందుకున్నాడు. ఈ క్రమంలో.. ముంబై తరఫున ఆడుతున్న అద్భుతంగా రాణిస్తున్న సూర్యకుమార్ యాదవ్ ముంబై ఓపెనర్గా దిగాడు.
ఇదే ఐపీఎల్ ట్రోఫీలో ఆడి మూడు మ్యాచ్ల్లో 124 పరుగులు చేశాడు. అలాంటి సూర్యకుమార్ను ఉమేశ్ యాదవ్ తొలి బంతికే క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో సూర్యకుమార్ గోల్డెన్ డక్గా పెవిలియన్కు చేరాడు. ఆ తరవాతి బంతికే ఇషాన్ కిషన్ను కూడా ఉమేష్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇషాన్ కూడా గత మూడు మ్యాచ్ల్లో చాలా బాగా ఆడాడు.
తొలి మ్యాచ్లో 44 పరుగులు చేశాడు. మూడు మ్యాచ్ల్లో కలిపి 93 పరుగులు చేశాడు. కానీ నేటి మ్యాచ్లో ఉమేశ్ వేసిన అద్భుత బంతికి గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. వాస్తవానికి సూర్యకుమార్, ఇషాన్లను ఒకే రకమైన బంతులకు ఉమేశ్ బౌల్డ్ చేశాడు. రెండూ ఇన్ స్వింగర్లే.. రెండూ ఆఫ్ స్టంప్ బౌల్డ్లే. అసలు ఉమేశ్ వేసిన ఆ రెండు బంతులు ఈ మ్యాచ్కే కాదు.. ఈ ఐపీఎల్ సీజన్కే హైలైట్గా నిలుస్తాయనడంలో సందేహం లేదు.