
హైదరాబాద్: ఏడాదిన్నర విరామం తర్వాత జట్టులో చోటు సంపాదించుకున్న ఆటగాడు రైనా. సాధారణంగా అలాంటి పరిస్థితుల్లో జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలనే ఆరాటంతో తడబడుతుంటారు. కానీ అలాంటిదేమీ రైనాలో కనిపించలేదని అంటున్నాడు టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి. ఇటీవల దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్లో అవసరానికి తగ్గట్లు ఆడిన రైనా.. భారత జట్టు సిరీస్ సాధించడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే శ్రీలంకలో జరిగే ముక్కోణపు టీ20 సిరీస్కు సైతం రైనా ఎంపికయ్యాడు.
సఫారీలతో జరిగిన ఆఖరి టీ20 సిరీస్లో సురేశ్ రైనా ఆటతీరును రవిశాస్త్రి విశ్లేషించాడు. రైనా అనుభవజ్ఝుడు. అనుభవం ఉన్న ఆటగాళ్లు ఎలా ఆడాలో అతడు నిరూపించాడు. అతనిలో నాకు నచ్చిన విషయం ఏంటంటే.. అతడికి భయం అంటేనే తెలీదు. సాధారణంగా ఏ ఆటగాడైనా చాలా రోజుల తరువాత జట్టులోకి పునరాగమనం చేసినప్పుడు టీమ్లో తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ఆడతారు. అలాంటి భావన మీలో ఒత్తిడిని మరింత పెంచుతుంది. కానీ అలాంటిదేమీ పట్టించుకోకుండా తనదైన శైలిలో అతడు బ్యాటింగ్ చేశాడు. అది చూడటానికి చాలా బాగుంటుందని.. శాస్త్రి చెప్పాడు.
ఇక రైనా మాట్లాడుతూ..జట్టు పరిస్థితులకు తగ్గట్టు ఆడటమే తన ముందున్న కర్తవ్యమన్నాడు. టీమిండియా ట్రోఫీలను గెలవడంలో తనవంతు పాత్ర ఉండాలని ఆరాట పడతానన్నాడు. ఆ తర్వాతే వ్యక్తిగత ప్రదర్శనకు ప్రాధాన్యత ఇస్తానని రైనా పేర్కొన్నాడు.
పాండ్య వైఫల్యంపై స్పందించిన కోచ్.. ఆటగాళ్లు తమ తప్పుల నుంచే పాఠాలు నేర్చుకుంటారని వెల్లడించాడు. పాండ్య తన తప్పిదాల నుంచి త్వరలోనే బయటపడి గాడిలో పడతాడని అతనికి మద్దతుగా నిలిచాడు. అతనిలో అపారమైన టాలెంట్ ఉందని శాస్త్రి వివరించారు.