హైదరాబాద్: స్థానమేదైనా.. మైదానంలో కనిపిస్తూ ఉండాలని ఆశపడే ప్లేయర్లు కోకొల్లలు. కానీ, వయస్సు రీత్యా మైదానానికి రిటైర్ అవ్వాల్సిందే. ఈ క్రమంలో చాలా మంది రిటైర్ అయినా కోచ్గానో కామెంటేటర్గానో కనిపిస్తూనే ఉంటారు. కానీ, మైదానంలో మళ్లీ చెలరేగే అవకాశం దక్కితే.. త్వరలో ప్రారంభం కానున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్పీఎల్)లో ఓ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాడు ఇప్పటికే కోచ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
రాఘవేంద్ర అరవింద్... ప్రస్తుతం ఇతని వయసు 31. పాఠశాలకు వెళ్లే రోజుల్లోనే క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడు. సుమారు 17 ఏళ్ల పాటు క్రికెట్ ఆడాడు. కానీ, వరుసగా గాయాల పాలవ్వడంతో 2015లో క్రికెట్కు దూరమవ్వక తప్పలేదు. దీంతో అతడు ఏ మాత్రం నిరాశ చెందకుండా ఆస్ట్రేలియా వెళ్లి క్రికెట్ కోచింగ్ కోర్సులను కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత తిరిగి భారత్ వచ్చేశాడు.
ఇంతలో అతడికి భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ నడుపుతోన్న క్రికెట్ అకాడమీలో కోచ్గా బాధ్యతలు నిర్వహించే అవకాశం దక్కింది. తనలో ఇంకా క్రికెట్ ఆడాలన్న కోరిక బలంగా ఉండటంతో టీఎన్పీఎల్లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. రెండు రోజుల క్రితం టీఎన్పీఎల్ కోసం ఆటగాళ్ల డ్రాఫ్ట్ నిర్వహించారు. ఇందులో 31ఏళ్ల అరవింద్ను దిండిగల్ డ్రాగన్స్ దక్కించుకుంది. జులై 11 నుంచి ఈ ఏడాది టీఎన్పీఎల్ సీజన్ ప్రారంభంకానుంది.
ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ...'క్రికెట్కు దూరంగా ఉండలేను. ఆడుతూనో, కోచింగ్ ఇస్తూనో క్రికెట్తోనే ఉండాలనుకుంటాను. క్రికెట్కు దూరమైనప్పుడు డిప్రెషన్లోకి వెళ్లిపోయా. ఆ సమయంలో ఆరోగ్యం కూడా పాడైంది. చాలా కఠినమైన సమయాన్ని ఎదుర్కొన్నాను' అని అరవింద్ వివరించాడు. ఇక్కడో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఏడాది టీఎన్పీఎలలో దిండిగల్ డ్రాగన్స్కు రవిచంద్రన్ అశ్వినే నాయకత్వం వహిస్తున్నాడు. ఈ జట్టులోనే అరవింద్ సభ్యుడు.