క్రికెట్ పాలక కమిటీ (సీఓఏ), బీసీసీఐ తాత్కాలిక కమిటీ మధ్య విభేదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్-12 ట్రోఫీని అందజేయాలని సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ కోరుకున్నా.. ప్రొటోకాల్ ప్రకారం బోర్డు అధ్యక్షుడు సీకే ఖన్నా అందించాడు. మరోవైపు ప్రొటోకాల్ ప్రకారమే నడుచుకోవాలని సీఓఏ మరో సభ్యుడు రవి తోడ్గె కూడా సూచించాడు. దీంతో ట్రోఫీ అందజేయాలన్న కోరిక ఎడుల్జీకి తీరలేదు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
ఐపీఎల్ ముందు గత మార్చిలో భారత్తో జరిగిన వన్డే సిరీస్ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. అప్పుడు బోర్డు అధ్యక్షుడు సీకే ఖన్నా ట్రోఫీ అందజేయాల్సి ఉన్నా.. ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం చీఫ్ రజత్ శర్మ అందజేశారు. ఈ విషయంపై గురువారం చేసిన ఓ ప్రకటనలో సీకే ఖన్నాపై డయానా ఆగ్రహం వ్యక్తం చేసింది.
'ఏప్రిల్ 8న జరిగిన పాలకుల కమిటీ సమావేశంలో ట్రోఫీ గురించి చర్చించాం. ఢిల్లీలో ఆస్ట్రేలియాకు ట్రోఫీ అందించకుండా తాత్కాలిక అధ్యక్షుడు తన హక్కును వదులుకున్నాడు. దిల్లీ క్రికెట్ సంఘం అధికారితో ట్రోఫీ ఇప్పించి ప్రొటోకాల్ ఉల్లంఘించారు. దీంతో బీసీసీఐ అధ్యక్ష పదవిని అవమానించారు. అందుకే ఐపీఎల్-12 ట్రోఫీని సీఓఏ సభ్యులే అందజేయాలని సూచించా. సీఓఏ అధినేత వినోద్ రాయ్ హాజరుకాకుంటే.. మిగతా సభ్యులు ట్రోఫీని అందజేయాలని వెల్లడించాను' అని డయానా తెలిపారు.
'ఐపీఎల్ విజేతకు బోర్డు అధ్యక్షుడే ట్రోఫీ అందజేయడం ఆనవాయితీ. ప్రొటోకాల్ అని 2017లో బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి రాసిన ఓ ఈమెయిల్ను ఖన్నా ఫైనల్ రోజు తీసుకొచ్చారు. దీంతో ట్రోఫీని నేను అందించకుండా అడ్డుకున్నారు. ఇప్పటి వరకు ఎన్నో మెయిల్స్ పంపించినా.. డీడీసీఏ ప్రతినిధితో ఆసీస్కు ట్రోఫీ ఎందుకు ఇప్పించారో సమాధానం ఇవ్వలేదు. మేము ఐపీఎల్ ట్రోఫీ అందించకుండా బీసీసీఐలోని కొందరు కుట్రలు చేస్తున్నారు' అని డయానా పేర్కొన్నారు.