ఆటకు వయసుతో సంబంధం లేదు
అయితే ఆటకు వయసుతో సంబంధం లేదని గేల్ మరోసారి నిరూపించాడు. హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో క్రిస్ గేల్ (63 బంతుల్లో 104 నాటౌట్) చెలరేగడంతో.. పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. టీ20ల్లో గేల్కు ఇది 21వ సెంచరీ కావడం విశేషం. ఐపీఎల్ వేలంలో చివరి నిమిషంలో గేల్ను సొంతం చేసుకున్న పంజాబ్ తెగ మురిసిపోతోంది.
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న గేల్
ఈ మ్యాచ్లో సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన క్రిస్ గేల్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. అవార్డు అందుకున్న అనంతరం క్రిస్ గేల్ మాట్లాడుతూ 'చాలా మంది నేను ముసలివాడినైపోయానని అనుకున్నారు. ఈ ఇన్నింగ్స్ తర్వాత నేను కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. ఈ సెంచరీ నా కూతురికి అంకితం. శుక్రవారం ఆమె బర్త్డే. నేను కింగ్స్ పంజాబ్ జట్టులో చేరినప్పటి నుంచీ సెహ్వాగ్ నాకు ఒకటే చెబుతున్నాడు. యోగా, మసాజ్ చేసే వ్యక్తులతోనే ఎక్కువగా గడపమని. నా సక్సెస్కు అదే కారణం అనుకుంటా' అని నవ్వుతూ చెప్పాడు.
నేనేదో నిరూపించుకోవాలని చాలా మంది అన్నారు
'నేను ఏ జట్టు తరఫున ఆడినా వంద శాతం నా మెరుగైన ప్రదర్శన చేయాలనే అనుకుంటాను. ఈ ఏడాది కొత్త ఫ్రాంఛైజీకి ఆడుతున్నాను. జనవరిలో నిర్వహించిన వేలంలో మొదట నన్ను ఎవరూ తీసుకోలేదు. కానీ, చివర్లో సెహ్వాగ్ మెంటార్గా ఉన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నన్ను తీసుకుంది. దీంతో చాలా మంది ఈ సీజన్లో నేనేంటో రుజువు చేసుకోవాలని అన్నారు.ఐపీఎల్లో నేనేదో నిరూపించుకోవాలని చాలా మంది అన్నారు. నన్ను ఎంచుకొని సెహ్వాగ్ ఐపీఎల్ను కాపాడాడు. గేల్ రెండు మ్యాచ్లు గెలిపించినా మేం పెట్టిన డబ్బుకు న్యాయం చేసినట్లే అని ఓ ఇంటర్వ్యూలో సెహ్వాగ్ చెప్పాడు. దీనిపై అతనితో మాట్లాడాలని అనుకుంటున్నా. నేను ఎవరికో ఏదో నిరూపించాలని ఇక్కడికి రాలేదు. నా క్రికెట్ను ఎంజాయ్ చేయాలనుకుంటున్నా' అని గేల్ చెప్పుకొచ్చాడు.
|
మొహాలీలో సన్రైజర్స్పై పంజాబ్కి ఇదే తొలి విజయం
ఐపీఎల్లో క్రిస్ గేల్ ఇప్పటివరకు 19 హాఫ్ సెంచరీలు, 6 సెంచరీలు చేశాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఆటగాళ్ల గేల్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. అనంతరం 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 178/4కే పరిమితమైంది. దీంతో సన్రైజర్స్పై పంజాబ్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొహాలీలో సన్రైజర్స్పై పంజాబ్కి ఇదే తొలి విజయం కావడం గమనార్హం.