హైదరాబాద్: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్మన్ క్రిస్ గేల్ పరుగుల వరద పారించాడు. మంగళవారం జరిగిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఫైనల్లో క్రిస్ గేల్ (69 బంతుల్లో 146 నాటౌట్; 18 సిక్సులు, 5 ఫోర్లు) చెలరేగిపోవడంతో రంగపూర్ రైడర్స్ టైటిల్ విజేతగా నిలిచింది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రంగపూర్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 206 పరుగులు చేసింది. జట్టు స్కోరు ఐదు పరుగుల వద్ద ఓపెనర్ చార్లెస్ (3) వికెట్ను కోల్పోయినా.. ఆ తర్వాత మెక్కల్లమ్ (51 నాటౌట్)తో కలిసి క్రిస్ గేల్ ఆడిన ఆట ఇన్నింగ్స్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేసింది.
38 ఏళ్ల క్రిస్ గేల్ వరుసపెట్టి సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడటంతో ఫైనల్లో ప్రత్యర్థి జట్టు బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఈ మ్యాచ్లో క్రిస్ గేల్ ఏకంగా 18 సిక్సర్ల బాదాడు. 57 బంతుల్లో సెంచరీ సాధించిన గేల్ మరో 12 బంతుల్లోనే 46 పరుగులు చేశాడు. మొత్తం 128 పరుగులను ఫోర్లు, సిక్సర్ల ద్వారానే రాబట్టారు.
రెండో వికెట్కు గేల్, మెక్కల్లమ్ల జోడీ 201 పరుగులు సాధించింది. 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బెంగళూరు-పుణె వారియర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో క్రిస్ గేల్ 17 సిక్సర్లతో ప్రపంచ రికార్డుని నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఆ రికార్డుని ఇప్పుడు గేల్ తిరగరాశాడు.
అంతేకాదు టీ20ల్లో గేల్ 20వ సెంచరీని నమోదు చేశాడు. అనంతరం 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢాకా డైనమైట్స్ను 149/9కు పరిమితమైంది. జహ్రుల్ ఇస్లాం (50) అర్ధసెంచరీ చేసినా మిగతా వారు నిరాశపర్చారు. దీంతో రంగపూర్ రైడర్స్ జట్టు 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
గేల్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు దక్కాయి. అంతేకాదు టీ20ల్లో పదకొండువేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి బ్యాట్స్మన్ క్రిస్ గేల్ నిలిచాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.