IPL 2021: పంజాబ్ కింగ్స్కు భారీ షాక్.. ఐపీఎల్ను వీడిన స్టార్ బ్యాటర్! ఇక ప్లే ఆఫ్స్ కష్టమేనా?

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశ రసవత్తరంగా సాగుతోంది. లీగ్ దశ చివరి అంకానికి చేరుకోవడంతో ప్లే ఆఫ్స్ బెర్తు కోసం కొన్ని జట్లు ప్రయత్నిస్తున్నాయి. ఐపీఎల్ 2020 మాదిరిగానే ఈసారి కూడా లీగ్ చివరివరకు ప్లే ఆఫ్స్ బెర్తులు ఖాయం అయ్యేలా లేవు. చెన్నై సూపర్ కింగ్స్ (18) ఇప్పటికే అధికారిక ప్లే ఆఫ్స్ బెర్తు దక్కించుకోగా.. ఢిల్లీ క్యాపిటల్స్ (16) కూడా ఆ దిశగా వెళుతోంది. మరో రెండు స్థానాల కోసం హోరాహోరీ పోటీ కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఐదు జట్లు రెండు బెర్తుల కోసం పోటీపడుతున్నాయి. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (14) ప్లే ఆఫ్స్కు చేరువలోనే ఉంది. మరో విజయం సాధిస్తే.. దాదాపుగా బెంగళూరు కూడా టాప్-4లో చోటు దక్కించుకుంటుంది.

కింగ్స్కు భారీ షాక్:
ఇక మిగిలిన ఒక బెర్త్ కోసం కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పోటీపడుతున్నాయి. ఇందులో కోల్కతా, ముంబైలకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పంజాబ్, రాజస్థాన్ జట్లు మిగిలిన మూడు మ్యాచులలో గెలిస్తే.. ప్లే ఆఫ్స్కు వెళ్లే ఛాన్స్ ఉంది. ఈ రెండు జట్లకు ఇకనుంచి ప్రతి మ్యాచ్ కీలకమే. ఇలాంటి సమయంలో పంజాబ్ కింగ్స్కు భారీ షాక్ తగిలింది. విండీస్ స్టార్ బ్యాటర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పంజాబ్ కింగ్స్ జట్టును వీడాడు. బయో బబుల్తో విసిగిపోయిన గేల్.. ఐపీఎల్ను వదిలి వెళ్లడానికి నిర్ణయించుకున్నాడని పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ ఓ ప్రకటనలో తెలిపింది

మానసికంగా సిద్ధంగా ఉండాలనుకుంటున్నా:
కరీబియన్ ప్రిమియర్ లీగ్ (సీపీఎల్) 2021లో ఆడిన క్రిస్ గేల్ అక్కడి నుంచి నేరుగా ఐపీఎల్ 2021 ఆడేందుకు వచ్చాడు. బయో బబుల్ కారణంగా ఐపీఎల్ 14 నుంచి తప్పుకుంటున్నట్లు యూనివర్సల్ బాస్ ప్రకటించాడు. వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2021కు ముందు తనను తాను మానసికంగా రిఫ్రెష్ చేసుకోవాలని చూస్తున్నానని చెప్పాడు. 'గత కొన్ని నెలలుగా బయో బబుల్లో ఉంటున్నా. సీపీఎల్ 2021 నుంచి నేరుగా ఐపీఎల్ 2021 ఆడేందుకు వచ్చా. నన్ను నేను మానసికంగా సిద్ధంగా ఉండాలని నిర్ణయించుకున్నా. అందుకే ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నా' అని క్రిస్ గేల్ పేర్కొన్నాడు.

ప్లే ఆఫ్స్లో చూడాలనుకుంటున్నా:
'టీ20 ప్రపంచకప్లో వెస్టిండీస్కు సహాయం చేయడంపై దృష్టి పెట్టాలనుకుంటున్నా. అందుకోసం మానసికంగా సిద్ధంగా ఉండాలని నిర్ణయించుకున్నా. దుబాయ్లో విరామం తీసుకుంటా. నాకు విరామం ఇచ్చినందుకు పంజాబ్ కింగ్స్కు ధన్యవాదాలు. పంజాబ్ జట్టుకు నా శుభాకాంక్షలు. రాబోయే మ్యాచులు చాలా కీలకం. అన్ని గెలవాలని కోరుకుంటున్నా. పంజాబ్ కింగ్స్ను ప్లే ఆఫ్స్లో చూడాలని ఆశపడుతున్నా' అని యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ తెలిపాడు. ఐపీఎల్ రెండో దశలో కేవలం రెండు మ్యాచ్లే ఆడిన గేల్.. తనదైన శైలిలో ఆకట్టుకోలేకపోయాడు. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ యూఏఈ, ఒమన్ వేదికగా మెగా టోర్నీ జరగనుంది. భారత్లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో టోర్నీ యూఏఈకి తరలిపొయిన విషయం తెలిసిందే. ప్రపంచకప్ కోసం ఇప్పటికే అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాయి.

వెస్టిండీస్ టీ20 జట్టు
కీరన్ పొలార్డ్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వైస్ కెప్టెన్), క్రిస్ గేల్, ఫాబియన్ అలెన్, డ్వేన్ బ్రావో, రోస్టన్ చేజ్, ఆండ్రీ ఫ్లెచర్, షిమ్రన్ హెట్మైర్, ఎవిన్ లూయిస్, ఒబేడ్ మెక్కాయ్, రవి రాంపాల్, ఆండ్రీ రసెల్, లెండెల్ సిమన్స్, ఒషానే థామస్, హెడెన్ వాల్ష్ జూనియర్.
స్టాండ్ బై ప్లేయర్లు: జాసన్ హోల్డర్, డారెన్ బ్రావో, షెల్డన్ కాట్రెల్, ఏకేల్ హోసిన్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications