అహ్మదాబాద్: కరోనా వైరస్ కట్టడికి టీమిండియా టెస్ట్ ప్లేయర్ చతేశ్వర్ పుజారా తనవంతు సాయాన్ని ప్రకటించాడు. పీఎం కేర్స్ ఫండ్తోపాటు గుజరాత్ సీఎం సహాయనిధికి విరాళం ఇచ్చినట్లు మంగళవారం సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. అయితే ఎంత మొత్తం విరాళం ఇచ్చాడనే విషయాన్ని మాత్రం పుజారా స్పష్టం చేయలేదు.
'నేను, నా కుటుంబం పీఎం కేర్స్ ఫండ్, గుజరాత్ సీఎం రీలీఫ్ ఫండ్కు మా చిన్న విరాళాలను ప్రకటించాం. మీరు కూడా మీకు తోచిన సాయం చేస్తారని ఆశిస్తున్నా. ఈ విపత్కర పరిస్థితిల్లో దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న వైద్యులు, పోలీసులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.'అని పుజారా ట్వీట్ చేశాడు.
🙏🏻🙏🏻🙏🏻 @narendramodi @vijayrupanibjp pic.twitter.com/Gltna753Dx
— cheteshwar pujara (@cheteshwar1) April 7, 2020
ఈ మహామ్మారి కట్టడికి సాయాన్ని ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన లభించింది. ఇప్పటికే అనేక మంది ముందుకు వస్తున్నారు. ప్రభుత్వానికి మద్దతుగా నిలిచే క్రమంలో విరాళాలను ప్రకటించడంతో పాటు నిరుపేదలకు సహాయం చేస్తూ తన మంచి మనసు చాటుకున్నారు. క్రీడా ప్రముఖులందరూ ఇప్పటికే తమ విరాళలను ప్రకటించారు.
గోపీచంద్ విరాళం రూ.26 లక్షలు..
ఇక భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తన వంతు సాయంగా రూ.26 లక్షల విరాళాన్ని అందజేశాడు. ఇందులో రూ.11 లక్షలు ప్రధాన మంత్రి సహాయనిధికి.. రూ. 10 లక్షలు తెలంగాణ సీఎం సహాయనిధికి, రూ. 5 లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధికి ఇచ్చారు. బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ కూడా విరాళం ప్రకటించినా.. ఎంత మొత్తం అనేది వెల్లడించలేదు. మరోవైపు 23 సార్లు వరల్డ్ చాంపియన్గా నిలిచిన భారత స్టార్ స్నూకర్ బిలియర్డ్స్ చాంపియన్ పంకజ్ అద్వానీ రూ. 5 లక్షలు పీఎం కేర్స్ ఫండ్కు విరాళంగా అందజేశాడు.