హైదరాబాద్: బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్)లో లోధా కమిటీ సిఫారసుల అమలు చేసేందుకు గాను ఇంకా కొంత సమయం ఇవ్వాలని బీసీసీఐకి భారత మాజీ కెప్టెన్, క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ లేఖ రాశారు. రాష్ట్ర సంఘాల రాజ్యాంగాల్లో సవరణలు చేయడం, జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ సిఫార్సుల అమల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తాయని అందులో పేర్కొన్నాడు.
బీసీసీఐలో పారదర్శకత పెంచేందుకు గతేడాది సుప్రీంకోర్టు ప్రత్యేకంగా నియమించిన లోధా కమిటీ కొన్ని సిఫార్సుల్ని బోర్డుకి సూచించిన సంగతి తెలిసిందే. లోధా కమిటీ సిఫారసుల్ని అమలు చేసేందుకు బీసీసీఐ తొలుత ఆసక్తి కనబర్చ లేదు. దీంతో గతేడాది ఆరంభంలో అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను పదవుల నుంచి తప్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
దీంతో బోర్డులో కొంచెం కదలిక వచ్చింది. అయినా సరే, ఇప్పటికీ పూర్తి స్థాయిలో లోధా కమిటీ సిఫారసులను అమలు చేయలేదు. దీంతో తాజాగా మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందేమోనని భయపడిన బోర్డు దేశంలోని పదమూడు రాష్ట్ర సంఘాలకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం పంపి లోధా కమిటీ సంస్కరణల్ని అమలు చేయాలని సూచించింది.
బీసీసీఐ ఈమెయిల్కు క్యాబ్ అధ్యక్షుడి హోదాలో గంగూలీ లేఖ రాశారు. 'కొన్ని నెలల క్రితం ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో సభ్యులందరూ బీసీసీఐ నిర్ణయంతో ఏకీభవించారు. బీసీసీఐ, రాష్ట్ర స్థాయిలో అమలు చేయడంలో ఉన్న ఇబ్బందుల గురించి సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తాం' అని దాదా తెలిపాడు.
'గత సమావేశంలో సభ్యులంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. మరోసారి ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరిగితేనే మీరు పంపిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలం. గత వారమే మీ మెయిల్ వచ్చింది. ఇంతలోనే ఎస్జీఎంను ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకునేందుకు సమయం పడుతుంది' అని లేఖలో గంగూలీ పేర్కొన్నారు.
మరోవైపు సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మధుకర్ వోరా సైతం ఇదే తరహాలో సమాధానమిచ్చారు.