హైదరాబాద్: 'ఎమ్మెస్కే ప్రసాద్ పదవీ కాలం ముగిసినట్టేనా?' అంటే దాదాపు పరిస్థితుల ప్రభావం అలానే అనిపిస్తోంది. బీసీసీఐ కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చి, ఎన్నికలు జరిగాక ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సెలక్షన్ కమిటీకి పొడిగింపు లభించకపోవచ్చు. పాత విధానం ప్రకారమే సీనియర్, జూనియర్ స్థాయిలో ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీలు ఉండాలని గురువారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
సెలక్టర్ కచ్చితంగా టెస్టు క్రికెట్ ఆడి ఉండాలన్న నిబంధననూ కోర్టు పక్కన పెట్టింది. కొత్త విధానం ప్రకారం.. ఏడు టెస్టులు లేదా 10 వన్డేలు లేదా 30 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడినవాళ్లు సెలక్టర్ అయ్యేందుకు అర్హులు. కోర్టు ఆదేశం ప్రకారం.. ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసే బాధ్యతను క్రికెట్ సలహా మండలికి అప్పగించాల్సివుంటుంది. 'ఎన్నికలు జరిగేంత వరకు ప్రస్తుత సెలక్టర్లు కొనసాగుతారు. కొత్త బీసీసీఐ పాలక మండలి వచ్చాక వారికి పొడిగింపు లభించే అవకాశాలు చాలా తక్కువ' అని ఓ సీనియర్ బీసీసీఐ అధికారి చెప్పాడు.
ప్రస్తుత సెలక్షన్ కమిటీలో ప్రసాద్తో పాటు శరణ్దీప్ సింగ్, దేవాంగ్ గాంధీ సభ్యులు. 'ఒక రాష్ట్రం.. ఒకే ఓటు' నిబంధన పోయింది. పదవీకాలాల మధ్య విరామ నిబంధనలోనూ సడలింపు. క్రికెట్ పాలకులకు ఊరటనిస్తూ కొన్ని కీలక సవరణలతో బీసీసీఐ కొత్త రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు ఆమోదించింది. నెల రోజుల్లోగా కొత్త రాజ్యాంగాన్ని అమలు చేయకపోతే తీవ్ర చర్యలు తప్పవని రాష్ట్ర సంఘాలను హెచ్చరించింది.
దీనిపై స్పందించిన సీఓఏ అధ్యక్షుడు వినోద్ రాయ్ మాట్లాడుతూ.. 'ఇది మంచి తీర్పు. ఆఫీస్ బేరర్లు వరుసగా రెండు పర్యాయాలు పదవిలో ఉండడంపై నాకెలాంటి అభ్యంతరమూ లేదు. విరామానికి ముందు ఆఫీస్ బేరర్కు ఆరేళ్ల పదవీకాలం ఉండాలని నేనే భావించా. కానీ ఏకాభిప్రాయం సాధించలేకపోయా. ఎట్టకేలకు మా ముందు మార్గసూచి ఉంది. ఇక కొత్త రాజ్యాంగాన్ని అమలు చేసి, ఎన్నికలు నిర్వహించడమే తరువాయి' అని స్పష్టం చేశారు.