వెల్లింగ్టన్: శుక్రవారం న్యూజిలాండ్తో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా మరో అద్భుత విజయాన్ని అందుకుంది. సూపర్ ఓవర్కు దారి తీసిన ఈ మ్యాచ్లో భారత్ గెలుపొందిన విషయం తెలిసిందే. వరుసగా రెండో సూపర్ ఓవర్లో విజయం సాధించడంపై ట్విటర్ వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. మ్యాచ్ అనంతరం టీమిండియా కోచ్ రవిశాస్త్రి తన ఆటగాళ్ల ప్రదర్శనతో తబ్బిబ్బవుతున్నారు. ట్విటర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు.
సీఏసీ సభ్యుడిగా ఆర్పీ సింగ్.. ఏడాది పాటు పదవీకాలం!!
'అసలైన క్రేజీ గేమ్ ఇదే' అంటూ రవిశాస్త్రి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. #INDvsNZ, #SuperOver, #TeamIndia అనే హ్యాష్ ట్యాగ్లు జతచేసారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తన జట్టు సభ్యులపై ప్రశంసలు కురిపించారు. 'ప్రతి సవాలునూ ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాం. ఇదో అద్భుతమైన ఆట' అని కోహ్లీ ట్వీట్ చేశాడు. 'శార్దూల్ ఠాకుర్ చెయ్యి చాలా పెద్దది. మంచి ప్రదర్శన చేశావు సోదరా' అని మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నారు.
Can be a real crazy game #INDvsNZ #SuperOver #TeamIndia 🇮🇳🙏 pic.twitter.com/F2LwaCjB5T
— Ravi Shastri (@RaviShastriOfc) January 31, 2020
'వరుస రెండు మ్యాచ్లలో సూపర్ ఓవర్ జరగడం చూడడానికి చాలా బాగుంది. నాలుగో టీ20లోని చివరి మూడు ఓవర్లలో భారత పేసర్లు అద్భుతంగా రాణించారు. టీ20లో 18 పరుగులను కాపాడుకున్నారంటే మామూలు విషయం కాదు. చివరి వరకు పోరాడి గెలుపొందడాన్ని ఆస్వాదిస్తున్నా. ఇదో అద్భుతమైన విజయం' అని భారత దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేసారు. 'కివీస్ ఆటగాళ్లు బాగా ఆడారు. అయితే వారు సూపర్ ఓవర్లలో రాణించలేకపోతున్నారు' అని ఇంగ్లీష్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అన్నారు.
నాలుగో టీ20 మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్ కూడా 7 వికెట్లు కోల్పోయి 165 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ 'టై'గా మారి.. సూపర్ ఓవర్కు దారి తీసింది. సూపర్ ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ చేయగా.. కివీస్ 13 పరుగులు చేసింది. తర్వాత టీమ్ సౌథీ బౌలింగ్ చేయగా.. రాహుల్, కోహ్లీ జట్టును గెలిపించారు. ఈ విజయంతో టీమిండియా ఐదు మ్యాచ్ల సిరీస్లో 4-0తో ఆధిక్యంలో ఉంది. ఆదివారం చివరి టీ20 జరగనుంది.