తుపాను వచ్చే ముందు ఇలా:
అయితే అన్ని ఫ్రాంఛైజీల కంటే ముందే ముంబై ఇండియన్స్ తమ ఆటగాళ్ల ఆరోగ్య విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే ముంబై ప్రాంచైజీ అందరి ఆటగాళ్లను రప్పించి క్వారంటైన్లో పెట్టింది. ఇందుకు సంబందించిన ఓ ఫొటోను సోమవారం పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చెవులకు హెడ్సెట్ పెట్టుకుని హాయిగా సంగీతం వింటున్నాడు. అదే ఫొటోను ముంబై ఇండియన్స్ మరోసారి ట్వీట్ చేసి.. 'తుపాను వచ్చే ముందు ఉండే ప్రశాంతత' అని రాసుకొచ్చింది. అంటే త్వరలో దుబాయ్లో జరగబోయే ఐపీఎల్లో బుమ్రా విజృంభిస్తాడని చెప్పకనే చెప్పింది.
ఐదు నెలల పాటు దూరం:
జస్ప్రీత్ బుమ్రా గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత చాలా కాలం ఆటకు దూరమయ్యాడు. వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున్న బుమ్రా.. దాదాపు ఐదు నెలల పాటు టీమిండియాకు దూరమయ్యాడు. అనంతరం కోలుకుని ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. అయితే ఆ పర్యటనలో అతడు పెద్దగా రాణించలేదు. దాంతో విమర్శలపాలయ్యాడు. ఇక స్వదేశానికి తిరిగొచ్చాక దక్షిణాఫ్రికాతో ఆడాల్సిన వన్డే సిరీస్ వాయిదా పడింది. ఆ వెంటనే లాక్డౌన్ విధించడంతో ఐపీఎల్ 2020 నిరవధిక వాయిదా పడింది.
ఐదు వైరస్ పరీక్షలు:
ఐపీఎల్ 2020ని పూర్తి బయో సెక్యూర్ వాతావరణంలో టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులు, సిబ్బందికి ఐదుసార్లు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం అందరూ క్వారంటైన్లో ఉన్నారు. ముంబైకి వచ్చేముందే ఆటగాళ్లు ఉన్న నగరంలోనే రెండు సార్లు పరీక్షలకు హాజరయ్యారు. ముంబై వచ్చాక మరో మూడు సార్లు టెస్టులు నిర్వహిస్తారు. ఆపై యూఏఈ బయలుదేరుతారు.
నాలుగు టైటిల్స్:
రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఇప్పటికే నాలుగు టైటిల్స్ గెలుచుకుంది. దాంతో ఐపీఎల్ చరిత్రలో నాలుగోసారి టైటిల్ సాధించిన మొదటి జట్టుగా చరిత్ర సృష్టించింది. గతేడాది చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన తుది పోరులో తలపడిన ముంబై.. కేవలం ఒకే ఒక్క పరుగుతో విజయం సాధించింది. చివరి ఓవర్లో లసిత్ మలింగ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ముంబై గట్టెక్కింది. ఇక ఈసారి ఎవరు గెలుస్తారో తెలియాలంటే నవంబర్ 10 వరకు వేచి చూడాలి.