టెస్టు మ్యాచ్ బౌలర్ల నుంచి ఏది కోరుకుంటామో
మరోవైపు చివరి టెస్టులో విజయం సాధించి సిరీస్ను డ్రా చేయాలని ఆస్ట్రేలియా గట్టి పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో టెస్టు మ్యాచ్ బౌలర్ల నుంచి ఏది కోరుకుంటామో.. అవన్నీ బుమ్రాలో పుష్కలంగా ఉన్నాయని బ్రాడ్హడ్జ్ చెప్పాడు. బ్రాడ్ హడ్జ్ మాట్లాడుతూ "రెండు జట్ల మధ్య తేడా పుజారా. రెండు జట్ల బౌలింగ్ దళాలు పటిష్టంగా ఉన్నాయి. మెల్బోర్న్లో మయాంక్ అగర్వాల్ను మినహాయిస్తే ఓపెనర్లు అందరూ విఫలమయ్యారు" అని అన్నాడు.
మూడో స్థానంలో ఆడిన పుజారా చాలా కీలకం
"అందుకే మూడో స్థానంలో ఆడిన పుజారా చాలా కీలకం. అతడు అస్సలు చెత్తగా ఔటవ్వలేదు. ఆటపై పట్టు సాధించేందుకు సమయం తీసుకున్నాడు. పెర్త్, అడిలైడ్లో నాథన్ లయాన్ విజృంభించాడు. అతడిని ఎదుర్కొన్న పుజారా ప్రాముఖ్యం తక్కువ చేయలేం. అతడు ఆడటంతోనే తొలి టెస్టులో టీమిండియా పుంజుకుంది" అని హడ్జ్ పేర్కొన్నాడు.
బుమ్రా బంతులను ఎదుర్కోవడం ఓ పీడకలే
"బుమ్రా బంతులను ఎదుర్కోవడం ఒక పీడకలే. ఏ బ్యాట్స్మన్ను అడిగినా, వామ్మో అనే అంటారు. వేగం, కచ్చితత్వంతోపాటు వికెట్కు ఇరువైపులా బంతిని తిప్పగలడు. టెస్టు బౌలర్కు ఉండాల్సిన లక్షణమిదే. అతడికి ఎకానమీ, స్ట్రైక్రేట్ను అప్పుడే కపిల్దేవ్తో పోలుస్తున్నారు. కేవలం 12 నెలల్లోనే అతడితో పోలుస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు" అని అన్నాడు.
గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉంది
"భారత బౌలింగ్ దళం గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉంది. బుమ్రా, ఇషాంత్, షమి అద్భుతంగా రాణిస్తున్నారు" అని బ్రాడ్హడ్జ్ అన్నాడు. టీమిండియా సిరీస్ నెగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హాడ్జ్ చెప్పాడు. నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఇరు జట్ల మధ్య జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా చివరి టెస్టు జరగనుంది. అనంతరం ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది.