ముంబై: భారత్తో డిసెంబర్ నెలలో యూఏఈలో సిరీస్ ఉంటుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నమ్మకంతో ఉంది. అయితే, దీని పైన మరో సమస్య వచ్చి పడింది. సమాచారం మేరకు... బ్రాడ్ కాస్టింగ్ హక్కుల విషయంలో బీసీసీఐ విబేధిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ ప్రసార హక్కుల విషయంలో సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో భారత్ - పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్ చిక్కుల్లో పడినట్లుగా కనిపిస్తోంది. పాకిస్తాన్ సిరీస్ హక్కులను ఎస్సెల్ గ్రూప్నకు చెందిన టెన్ స్పోర్ట్స్ కలిగి ఉంది. అయితే ఐపీఎల్కు పోటీగా రెబల్ టీ-20 లీగ్ను ఏర్పాటు చేస్తున్నట్టు ఇటీవల ఎస్సెల్ గ్రూప్ ప్రకటించింది.
దీంతో భారత్ - పాక్ సిరీస్ను టెన్ స్పోర్ట్స్ ప్రసారం చేయడంపై బీసీసీఐ తీవ్రంగా అభ్యంతరం చెబుతోంది. పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్ - జగ్మోహన్ దాల్మియా మధ్య ప్రధానంగా ఇదే చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
ఈ సమస్యకు బీసీసీఐ ఏదో ఒక పరిష్కారం కనుగొనగలదని పీసీబీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కాగా ప్రభుత్వం ఈ సిరీస్కు అనుమతిస్తే మిగతా అడ్డంకులు తొలగిపోతాయని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి. కాగా, రెండు రోజుల క్రితం.. లోకసభలో బీజేపీ ఎంపీ ఒకరు పాక్ - సిరీస్ పైన మండిపడ్డ విషయం తెలిసిందే.