
హైదరాబాద్: ఇటీవలే ముగిసిన ముంబై లీగ్, కర్ణాటక ప్రీమియర్ లీగ్లతో పాటు పలు రాష్ట్రాల్లో ఇప్పటికే లీగ్లు ప్రారంభించాలనే యోచనలో ఉన్నాయి. పలు క్రికెట్ సంఘాలు తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా లీగ్లు నిర్వహించేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక ప్రీమియర్ లీగ్, తమిళనాడు ప్రీమియర్ లీగ్, తెలంగాణ టీ20 లీగ్, ముంబై టీ20 లీగ్లను ఆయా క్రికెట్ సంఘాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ప్రతిభగల స్థానిక ఆటగాళ్లను గుర్తించడం, క్రీడా నైపుణ్యాలు మెరుగుపరచడం కోసం వీటిని నిర్వహిస్తున్నాయి. తాజాగా గుజరాత్ ప్రీమియర్ లీగ్(జీపీఎల్) తెరపైకి వచ్చింది. తొలిసారి నిర్వహించనున్న టీ20 క్రికెట్ టోర్నమెంట్ మే 28న ప్రారంభం కాగా జూన్ 10న ముగుస్తుంది. సూరత్, అహ్మదాబాద్, రాజ్కోట్ వేదికల్లో మ్యాచ్లు జరగనున్నాయి.
12 రోజుల పాటు జరిగే టోర్నీలో ఆరుగురు భారత మాజీ ఆటగాళ్లు, 18 మంది అంతర్జాతీయ, దేశీయ క్రికెటర్లు పాల్గొనున్నారు. మొత్తం ఆరు జట్లు ఉంటాయి. ఇందులో విజేతగా నిలిచిన జట్టుకు రూ.51లక్షలు రూపాయలు, రన్నరప్గా నిలిచిన జట్టుకు రూ.21లక్షలుగా ప్రకటించారు. అదే కాక లీగ్ లో పాల్గొన్న ప్రతి జట్టుకు కనీస బహుమతిగా రూ.2లక్షలు ప్రకటించారు.
ప్రతి జట్టులో ఒక భారత మాజీ ఆటగాడు, ముగ్గురు విదేశీ ఆటగాళ్లు, ముగ్గురు స్థానిక, నూతన క్రికెటర్లు ప్రాతినిధ్యం వహించనున్నారు. మహ్మద్ కైఫ్, ఓవైషా, గిబ్స్, మఖాయ ఎన్తిని, ముత్తయ్య మురళీధరన్, బ్రియాన్ లారా, ఆండ్రూ సైమండ్స్, అలిస్టర్ క్యాంప్బెల్, పావెల్, టినో బెస్ట్, మాథ్యూ హోగార్డ్, చార్లెస్ కోవెంట్రీ, ఫర్వేజ్ మహారూప్, చమీర సిల్వ, అజంత మెండిస్, పాల్ ఆడమ్స్, జస్టిన్ కెంప్, రమేశ్ పవార్తో తదితర స్టార్ ఆటగాళ్లు లీగ్లో భాగస్వామ్యం కానున్నారు.