ముంబై: మహమ్మారి కరోనా వైరస్ కారణంగా క్రీడాలోకం నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇక లాక్డౌన్ కారణంగా ఆటగాళ్లు అందరూ దాదాపు రెండు నెలలు ఇంటికే పరిమితమయ్యారు. మే నెల ఆఖరికి భారత దేశంలో లాక్డౌన్ ముగియనుండగా.. ఆ తర్వాత క్రికెటర్లు ప్రాక్టీస్ మొదలెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. రెండు నెలలుగా క్రికెట్కి దూరంగా ఉంటున్న టీమిండియా ఆటగాళ్లు కనీసం 6-8 వారాలు క్యాంప్లో ప్రాక్టీస్ చేయాలని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ సూచించాడు.
బ్యాగ్లో ఐదుగురు గర్ల్ఫ్రెండ్స్.. రియల్ లైఫ్లో మాత్రం ఒక్కరే: స్టార్ క్రికెటర్
తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాతో భరత్ అరుణ్ మాట్లాడుతూ... 'ఒక ప్రొఫెషనల్ క్రీడాకారుడు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం చాలా కష్టం. ఇది ఒక శాపం లాంటిది. అయితే కరోనా వైరస్ కారణంగా మరో ప్రత్యామ్నాయం కూడా లేకపోయింది. క్రికెటర్లకి 6-8 వారాలు క్యాంప్ని నిర్వహించాలని టీమిండియా మేనేజ్మెంట్ యోచిస్తోంది. అందులో రన్నింగ్, యో-యో టెస్టుతో పాటు మరో రెండు పరీక్షల్ని ఆటగాళ్లకి నిర్వహిస్తాం. మునుపటితో పోలిస్తే ఈ టెస్టులు మరింత కఠినంగా ఉండే అవకాశం ఉంది' అని అన్నాడు.
'రేసులో ఉపయోగించే గుర్రాన్ని ఎన్నిరోజులు బంధించినా.. ఆ తర్వాత అది పరుగెత్తాల్సిందే. ఎందుకంటే.. దానికి తెలిసింది పరుగు మాత్రమే. అలానే భారత క్రికెటర్లు కూడా. ఎన్ని రోజులు ఇంట్లో ఉన్నా.. తిరిగి ఫిట్నెస్ సాధించి క్రికెట్ ఆడాలి. మహ్మద్ షమీ ఈ లాక్డౌన్ వేళ శ్రమించి మెరుగైన ఫిట్నెస్ సాధించాడు. ఆటగాళ్లు కూడా ఎప్పుడెప్పుడు మైదానంలోకి అడుగుపెడదామా అని ఎదురుచూస్తున్నారు. ఆటగాళ్లకు ఫిట్నెస్ విషయంలో సలహాలు ఇస్తున్నా' అని భరత్ అరుణ్ తెలిపాడు.
షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ ప్రారంభంకావాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా ఆ టోర్నీ నిరవధికంగా వాయిదా పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో టోర్నీ నిర్వహించడం అసాధ్యమని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కోశాధికారి అరుణ్ ధుమాల్ వెల్లడించాడు. కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ, దేశీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఉన్న తరుణంలో టోర్నీ జరుపడం చాలా కష్టమని అన్నాడు.
భారత ఆటగాళ్లకు శిక్షణ శిబిరాలు నిర్వహించే ఆలోచన ఇప్పట్లో లేదని, అయితే స్థానికంగా సమీపంలో ఉన్న స్టేడియాల్లో వారు వ్యక్తిగతంగా ప్రాక్టీస్ చేసుకునేలా ప్రణాళిక రచిస్తున్నామని అరుణ్ ధుమాల్ అన్నాడు. ఇందుకోసం రాష్ట్ర క్రికెట్ సంఘాలతో మాట్లాడతామని వెల్లడించాడు.